
మండలికి టీఆర్ఎస్ ‘టార్గెట్’!
శాసనమండలిలో త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కన్నువేసింది.
- ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై ఆ పార్టీ కన్ను
- తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు గాలం
- మండలిలో ఆ పార్టీకి స్థానం లేకుండా చేయాలనే యోచన!
- మార్చి 29న ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలు
- ఈ నేపథ్యంలో దూకుడుగా వెళుతున్న అధికార పార్టీ
సాక్షి, హైదరాబాద్: శాసనమండలిలో త్వరలో ఖాళీకానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కన్నువేసింది. ఇందుకోసం ముందస్తు వ్యూహం పన్నింది. అందులో భాగంగా టీడీపీ నేతలకు గాలం వేస్తోంది. దాంతోపాటు టీడీపీకి మండలిలో స్థానం లేకుండా చేయాలనే ఆలోచనలో టీఆర్ఎస్ ఉన్నట్లు కనిపిస్తోంది.
దాదాపు నెల రోజుల కింద తెలంగాణ భవన్లో జరిగిన మంత్రుల సమావేశంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. ‘టీడీపీ నుంచి మరో నలుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. వారూ మన పార్టీలో చేరిపోతారు..’ అని చేసిన ప్రకటనే ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీకి ఉన్న పదిహేను మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్లో చేరారు. మిగతా పన్నెండు మందిలో ఒకరు వరంగల్ జిల్లాలో, ముగ్గురు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు. ఇంకో ఎనిమిది మంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో నలుగురు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ నాయకులు గాలం వేసినట్లు సమాచారం.
ఐదు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకే..
మార్చి 29న ఎమ్మెల్యే కోటాలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే అదే తేదీన ఖాళీ అవుతున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఏడు స్థానాలకూ ప్రకటన వెలువడాల్సి ఉంది. శాసనసభలో ఆయా పార్టీలకున్న ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి వారు గెలుచుకునే ఎమ్మెల్సీ స్థానాలు ఆధారపడి ఉంటాయి.
అసెంబ్లీలోని మొత్తం స్థానాల సంఖ్యను ఖాళీ అయిన (ఎన్నిక జరగాల్సిన ) సీట్ల సంఖ్యతో భాగించి ఒక్కో ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు అవసరమో లెక్క తేలుస్తారు. ఈ లెక్కన ప్రస్తుతం ఖాళీ అవుతున్న ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు ఒక్కో ఎమ్మెల్సీకి 16 మంది ఎమ్మెల్యేలు అవసరం. టీఆర్ఎస్ నుంచి గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలకు తోడు కాంగ్రెస్ నుంచి నలుగురు, టీడీపీ నుంచి ఒకరు, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు, బీఎస్పీ నుంచి ఇద్దరు... మొత్తంగా 9 మంది గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 72కు చేరింది. దీంతో నలుగురు ఎమ్మెల్సీలను సులువుగానే ఎన్నుకోవచ్చు. ఎమ్మెల్సీని గెలుచుకోవాలంటే మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అవసరం. టీఆర్ఎస్తో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. వారు మద్దతిస్తే మొత్తంగా ఐదు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకోవడం టీఆర్ఎస్కు పెద్ద కష్టం కాకపోవచ్చు.
టీడీపీకి స్థానం లేకుండా వ్యూహం..
టీడీపీని శాసనమండలి బరిలో లేకుండా చేయడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించే పనిలో గులాబీ నాయకత్వం ఉందని చెబుతున్నారు. టీడీపీ నుంచి ఆరుగురు ఎమ్మెల్యేల కోసం గాలం వేశారని... వారిలో నలుగురు టీఆర్ఎస్ నాయకత్వంతో టచ్లో ఉన్నారని అంటున్నారు. పార్టీ మారినా, మారకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు క్రాస్ చేస్తే చాలన్న మంతనాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రహస్య బ్యాలెట్ కావడం, విప్ వర్తించే అవకాశం లేకపోవడంతో సాధ్యమైనన్ని టీడీపీ ఓట్లను (ఎమ్మెల్యేలను) కొల్లగొట్టే వ్యూహంలో టీఆర్ఎస్ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా టీడీపీ-బీజేపీ కూటమి కలిసి ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకునే సంఖ్యా బలాన్ని కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీని అసలు బరిలోనే లేకుండా చేయడం కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించే పనిలో టీఆర్ఎస్ నేతలు ఉన్నారని తెలిసింది. వాస్తవానికి ఇప్పటికే నగరానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవాల్సి ఉన్నా... వివిధ కారణాల వల్ల ఆలస్యమైందని, శాసన మండలి ఎన్నికల నేపథ్యంలో ఇక ఆలస్యం జరగకపోచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ సీటును గెలుచుకునే అవకాశం ఉంది.