అబూజ్‌మాడ్‌లో అగ్రనేతలు 

Top Maoist leaders in AbujaMad - Sakshi

మోస్ట్‌ వాంటెడ్‌ మావోయిస్ట్‌ నేతలంతా ఇక్కడే మకాం  

పట్టు సాధిస్తున్న కేంద్ర బలగాలు  

పెద్దపల్లి: కాకులు దూరని కారడవులు.. ఎత్తయిన కొండలు.. దట్టమైన దండకారణ్యం. గౌతమి, ఇంద్రావతి, శబరి, లాహిరీ నదుల పరిసరాలను విస్తరించిన అబుజ్‌మాడ్‌పై క్రమంగా పోలీసులు పట్టు సాధిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో దండకారణ్యంలో జరిగిన నాలుగు ఎన్‌కౌంటర్‌ సంఘటనలో రెండు అబూజ్‌మాడ్‌ కొండల్లోనే సాగడం ఇందుకు నిదర్శనం. మోస్ట్‌ వాంటెడ్‌ నేతలంతా మాడ్‌ ప్రాంతంలోనే ఉన్నట్లు భావిస్తున్న కేంద్ర బలగాలు.. ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. తాజాగా అబూజ్‌మాడ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. వందలాది ఎన్‌కౌంటర్లతో నష్టపోతున్న మావోయిస్టు పార్టీకి ఇప్పటికీ అబూజ్‌మాడ్‌ ప్రాంతంలో పటిష్టమైన నాయకత్వంతో జనతన సర్కార్‌ను నడుపుత్నునారు.

ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మహారాష్ట్ర ప్రాంతాలను ఆనుకుని ఉన్న నారాయణపూర్‌ ఖాంకేర్, రాజ్‌నంద్‌గామ్, జిల్లాల్లో విస్తరించిన అబూజ్‌మాడ్‌ ప్రాంతంలోని కొండలను స్థావరాలుగా ఏర్పాటు చేసుకున్న మావోయిస్టు పార్టీ 38 ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌లో పోటీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. వేల మైళ్ల అడవులతోపాటు నైబేరడీ గౌతమినదీ, పర్లకోటనదీ, ఇంద్రావతి, శబరి, లాహిరీ లాంటి నదులు పార్టీ దళాలకు దారి చూపే మార్గాలుగా ఉన్నాయి. తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్ట పోయినా ఇంకా 14 రాష్ట్రాల్లో ప్రాబల్యం ఉంది. అయితే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆ పార్టీకి అబూజ్‌మాడ్‌ ప్రాంతం గుండెకాయలాంటింది. ఆయుధాల తయారీ సహా పార్టీకి చెందిన దళాలకు రాజకీయ శిక్షణ, సైనిక శిక్షణ అంతా అబూజ్‌మాడ్‌లోనే జరుగుతున్నాయి.

అబూజ్‌మాడ్‌ను గుర్తించడానికి వందలసార్లు హెలీకాప్టర్లతో సర్వేలు నిర్వహించిన పోలీసు బలగాలు క్రమంగా చొచ్చుకెళ్తున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన కమెండోలు, కోబ్రా దళాలు, ఆక్వా ఫోర్స్, ఆదివాసీలకు చెందిన స్పెషల్‌ ఆఫీసర్‌ (ఎస్పీఓ)లు మావో దళాల కోసం నిత్యం అబూజ్‌మాడ్‌ ప్రాంతాన్ని గాలిస్తూ, తమ ఆ«దీనంలో తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే దశబ్దా కాలంగా పోలీసులు అబూజ్‌మాడ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించి వడ్స, బాంమ్రాఘడ్, చింతల్‌నాల్‌ లాంటి ప్రాంతాల్లో సైన్యం దెబ్బతిన్నది. చింతల్‌నాల్, మస్‌పూర్, ఖాంకేర్‌లలో మూడు సంఘటనలోనే వంద మందికిపైగా పోలీసులు మరణించారు. రాష్ట్రాల్లోని మావోయిస్టు కమిటీలలో మాడ్‌ డివిజన్‌ కమిటీ కీలకమైంది.  ఆ కమిటీ అదీనంలోనే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కీలక నేతలు ఉంటారని ప్రచారం. మోస్ట్‌ వాంటెడ్‌ మావోల స్థావరంగా అబూజ్‌మాడ్‌ను గుర్తించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top