మావోయిజం అంతం? గణాంకాలివే.. | India on Track to Eradicate Maoism Next Year | Sakshi
Sakshi News home page

మావోయిజం అంతం? గణాంకాలివే..

Jun 1 2025 7:22 AM | Updated on Jun 1 2025 8:49 AM

India on Track to Eradicate Maoism Next Year

న్యూఢిల్లీ: దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించే దిశగా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ నెల ప్రారంభంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్ర నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందనే మాట వినిపిస్తోంది.

1967లో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమాన్ని అంతం చేసే లక్ష్యానికి ప్రభుత్వం, భద్రతా దళాలు చేరువయ్యాయని ఎన్‌డీటీవీ యాక్సెస్ చేసిన డేటాలో వెల్లడవుతోంది. 2010లో 1,936 మావోయిస్టు హింసాత్మక సంఘటనలు జరిగాయని, ఇది 2024కి 374కి తగ్గిందని, అంటే ఏకంగా 81శాతం మేరకు తగ్గిందని హోం మంత్రిత్వ శాఖ డేటా  చెబుతోంది. మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య కూడా చాలా వరకూ తగ్గింది. 2013లో 126  ఉండగా, అది 2021నాటికి 70కి  తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి 18కి చేరింది.

మావోయిస్టులు సాగించిన హింసాత్మక ఘటనల్లో(violent incidents) పౌరుల మృతులను చూసుకుంటే 2010లో ఈ సంఖ్య 720గా ఉంది. 2019లో ఇది 150కి తగ్గింది. గత  ఏడాది 131గా ఉండగా, 2023లో 106గా ఉంది. ఈ  ఏడాది మార్చిలో ఈ తరహాలో 19 మరణాలు చోటుచేసుకున్నాయి. పౌరులు, భద్రతా దళాల సిబ్బంది మొత్తం మరణాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈ సంఖ్య 2010లో 1,005గా  ఉండగా, గత సంవత్సరం 85శాతానికి తగ్గి, 150కి చేరుకుంది.

కొన్నేళ్లుగా మావోయిస్టులు రైల్వే ఆస్తులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగ యూనిట్లు, టెలిఫోన్ ఎక్స్ఛేంజీలు, మొబైల్ టవర్లు, రోడ్లు , పాఠశాలలు లాంటి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ తరహా ఘటనలు 2010లో 365 నుండి 2017లో 75కి తగ్గాయి. 2024లో కేవలం 25గా ఉన్నాయి. ఈ  ఏడాది మొదటి నెలల్లోనే 150 మందికి పైగా మావోయిస్టులు మృతిచెందారు. ఈ సంఖ్య 2017లో 136గా ఉంది. 2023లో 380గా ఉండగా, గత  ఏడాది ఇది 290గా ఉంది.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ అనంతరం హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ గడచిన మూడు దశాబ్దాల్లో ఒక సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి హతం కావడం ఇదే తొలిసారని అన్నారు. ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పూర్తయ్యాక ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలలో 54 మంది నక్సలైట్లను అరెస్టు చేశామని, 84 మంది నక్సలైట్లు లొంగిపోయారని ఆయన అన్నారు. 2026 మార్చి 31 లోపు దేశంలోని మావోయిజాన్ని నిర్మూలించాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించుకున్నదని అమిత్‌ షా పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: ‘నమస్తే’కు రెండేళ్లు.. చేతులతో మలం ఎత్తడానికి ముగింపు పలుకుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement