అటో.. ఇటో.. | The state government earlier issued 235 | Sakshi
Sakshi News home page

అటో.. ఇటో..

Sep 3 2014 3:20 AM | Updated on Nov 9 2018 5:52 PM

ఎన్నికలకు ముందు... ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 235 జీవో జారీచేసింది.

సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఎన్నికలకు ముందు... ఈ ఏడాది ఫిబ్రవరిలో హుస్నాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 235 జీవో జారీచేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దుచేసింది. హుస్నాబాద్‌కు బదులు... హుజూరాబాద్‌ను రెవెన్యూ డివిజన్‌గా మారుస్తూ గత నెల 11న జీవో నం.18 జారీచేసింది. మూడు రోజులకే హుజూరాబాద్‌లో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని సైతం ప్రారంభించారు. మంత్రి ఈటెల రాజేందర్ తన సొంత నియోజకవర్గానికి పెద్దపీట వేసేం దుకు.. హుస్నాబాద్‌కు అన్యాయం చేశారం టూ విపక్షాలతోపాటు స్వపక్షం నుంచి నిరసనలు పెల్లుబికాయి. జేఏసీ ఆధ్వర్యంలో వరుసగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి.
 
  ప్రభుత్వం అనుచిత నిర్ణయం తీసుకుందని..  ఈ జీవోను సవాల్ చేస్తూ హుస్నాబాద్ మండలం నందారం గ్రామ పంచాయతీకి చెందిన ఆజ్మీర హర్యానాయక్ ఆగస్టు 27న హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఆయన తరఫున హైకోర్టు న్యాయవాది ఈ.మదన్‌మోహన్ రెండుసార్లు వాదనలు వినిపించారు. వాదనల అనంతరం  చట్టవిరుద్ధంగా జారీచేసిన 18 జీవోను రద్దుచేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన 235 జీవోను యధావిధిగా అమలుచేయాలని జడ్జి విలాస్ అఫ్జల్ పుర్కర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త రెవెన్యూ డివిజన్ వివాదం హుజూరాబాద్, హుస్నాబాద్‌ల మధ్య హాట్‌టాపిక్‌గా మారింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉం దని రెవెన్యూ అధికారులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులతో హుస్నాబాద్‌లో అఖిలపక్షాలు సంబరాలు జరుపుకున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement