అన్నదాతకు అండగా కొత్త మార్గదర్శకాలు | The new guidelines to farmers | Sakshi
Sakshi News home page

అన్నదాతకు అండగా కొత్త మార్గదర్శకాలు

Jul 21 2014 1:42 AM | Updated on Sep 2 2017 10:36 AM

అన్నదాతలకు గిట్టుబాటు ధర లభించినపుడే పంట అమ్ముకునేలా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది.

మార్కెటింగ్ శాఖ ప్రచారమే ముఖ్యం
 
సాక్షి, మంచిర్యాల :
అన్నదాతలకు గిట్టుబాటు ధర లభించినపుడే పంట అమ్ముకునేలా ప్రవేశపెట్టిన ‘రైతుబంధు’ పథకానికి ప్రభుత్వం మెరుగులు దిద్దింది. తాజా మార్గదర్శకాలు అమలు చేస్తూ అవగాహన కల్పిస్తే అన్నదాతలకు న్యాయం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు మార్కెటింగ్ శాఖ ప్రచారానికి రంగం సిద్ధం చేస్తోంది.
 
పథకం అమలు ఇలా..
మార్కెట్ యార్డు పరిధిలో ఉన్న రైతులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా పాస్‌బుక్ నకలు, రెండు ఫొటోలు ఇస్తే అధికారులు సదరు రైతుకు రైతుబంధు కార్డును అందజేస్తారు. ఈ కార్డుదారులకు దక్కే సౌలభ్యాలను ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆశాజనకంగా రూపొందించింది. పండించిన పంటకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర దక్కనపుడు మార్కెట్ యార్డులో ధాన్యం నిలువచేసుకొని దాని మొత్తం విలువలో 75 శాతం లేదా రూ.లక్ష రూపాయల లోపు రుణంగా గతంలో పొందేవారు.
 
యార్డుల్లో ధాన్యాన్ని మూడునెలల వరకు నిలువ చేసుకునే సదుపాయం ఉండేది. ఆ నిబంధనను తాజాగా మార్చి ధాన్యం విలువలో 75 శాతం మొత్తాన్ని రుణంగా ఇవ్వడం యథావిధిగా ఉంచుతూ రుణమొత్తాన్ని ప్రభుత్వం రూ.2 లక్షలకు పెంచుతూ తెలంగాణ సర్కారు జీవో నంబర్ 5ను జారీ చేసింది. మరోవైపు నిలువ ఉంచే సమయాన్ని 3 నెలల నుంచి ఆరు నెలలకు పెంచింది. దీంతోపాటు గతంలో ఉన్న వడ్డీ చెల్లించే అవసరం లేకపోవడాన్ని యథావిధిగా కొనసాగిస్తూ రైతుబంధు కార్డు కాలపరిమితిని ఐదేళ్లకు పెంచారు.
 
ప్రచారం ముఖ్యం
జిల్లాలో వరి, పత్తి, సోయా, కంది వంటి పంట లు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. ఈ పంటల లో ఎక్కువ వాటికి గిట్టుబాటు ధర దక్కడం లే దు. పంట చేతికి వచ్చిన సమయంలోనే అమ్ముకుంటే తక్కువ ధర వచ్చే నేపథ్యంలో యార్డుల్లో నిలువ చేసుకుంటే  గిట్టుబాట ధర వచ్చినపుడు అమ్ముకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో 17 మార్కెట్‌యార్డులు, 82 గోడౌన్లు అందుబాటు లో ఉన్నాయి.
 
ఇందులో 66,000 మెట్రిక్ టన్ను ల ధాన్యం నిలువ చేసే సదుపాయం ఉంది. అ యితే ప్రస్తుతం అందులో కొన్ని పౌరసరఫరాల శాఖకు లీజుకు ఇచ్చారు. అందులోనుంచి డీలర్ల కు పీడీఎస్ సరుకులు పంపిణీ చేసేలా ఎంఎల్‌ఎస్ పాయింట్లుగా పౌరసరఫరాల శాఖ ఉపయోగించుకుంటోంది. దీంతోపాటు ఇటీవల కొనుగోలు చేసిన ధాన్యం నిలువ ఉంచేందుకు ఐకేపీకి గోడౌన్లు అందజేశారు. అయితే ఐకేపీ నిలువ చేసిన ధాన్యం తరలిన తర్వాత రైతుబంధు అమలుకు ప్రచారం చేస్తామని మార్కెటింగ్ శాఖ పేర్కొంటోంది.
 
ఇప్పటివరకు లబ్ధిదారులు

జిల్లాలో 45,799 రైతుబంధు కార్డులు అందజేశారు. అయితే రైతుబంధు పథకాన్ని ఉపయోగించుకుంటున్న అన్నదాతలు ఏటా తగ్గుము ఖం పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం రైతుల కోసం కల్పించిన సౌలభ్యానికి తోడుగా మార్కెటింగ్‌శాఖ రైతుల్లో అవగాహన కల్పిస్తే మేలు.

Advertisement
 
Advertisement
Advertisement