రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడంతో భౌగోళికంగా ఎలాంటి మార్పులు ఉంటాయనేది కొన్ని ...
ప్రకటన చేయని ముఖ్యమంత్రి
‘భూపాలపల్లి’ విజ్ఞప్తిపై కానరాని స్పందన
ఇతర ప్రాంతాలపైనా ఇదే తీరు
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టడంతో భౌగోళికంగా ఎలాంటి మార్పులు ఉంటాయనేది కొన్ని నెలలుగా ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు భూపాలపల్లి కేంద్రంగా ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటవుతుందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అరుుతే, సీఎం కేసీఆర్ ఈ నెల 5న భూపాలపల్లి నియోజకవర్గంలోని చెల్పూరుకు వచ్చిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో.. భూపాలపల్లి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఎస్.మధుసూదనాచారి సీఎంకు విజ్ఞప్తి చేశారు. అరుునప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో ఎక్కడా కొత్త జిల్లా ఏర్పాటుపై ప్రకటన చేయలేదు. గత ఏడాది జనవరిలోనూ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో నాలుగు రోజులు పర్యటించారు. ఆ పర్యటనలో ఒక రోజు భూపాలపల్లికి వెళ్లి నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా జిల్లా ఏర్పాటుపై స్పష్టత ఇవ్వలేదు. ఇలా.. రెండుసార్లు భూపాలపల్లికి వచ్చినా జిల్లా ఏర్పాటుపై సీఎం ప్రకటన చేయకపోవడంతో ఆ ప్రాంత వాసుల్లో సందేహాలు కలుగుతున్నాయి. భూపాలపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు ఉంటుం దా లేదా అనేది విషయంలో అయోమయం నెలకొంది.
కొత్త జిల్లా ఏర్పాటు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీ అన్ని జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులు, కొత్త జిల్లాల ఆవశ్యకతను పరిశీలిస్తోంది. మన జిల్లా భౌగోళికంగా పెద్దగానే ఉంది. జిల్లా విస్తీర్ణం 12,846 చదరపు కిలో మీటర్లు. జిల్లాలో 35,12,576 జనాభా ఉంది. విస్తీర్ణం, జనాభా పరంగా పెద్దగా ఉండడంతో మన జిల్లాలోనూ మార్పులు జరగనున్నాయి. అరుుతే, ఈ మార్పులు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. సింగరేణి ప్రాంతాన్ని కలుపుతూ భూపాలపల్లి కేంద్రంగా ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జిల్లా ఏర్పాటవుతుందని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా కేంద్రం ఉండాలనే డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని ఉద్యమం జరుగుతోంది. జిల్లాలో మొదటి మున్సిపాలిటీగా ఉన్న జనగామ కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా ఉద్యమాలు జరుగుతున్నాయి. మరోవైపు ములుగు కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. ఈ విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్లు పెరుగుతుండగా.. ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది.