మొదటిరోజు ప్రశాంతం | The first day of calm | Sakshi
Sakshi News home page

మొదటిరోజు ప్రశాంతం

Mar 10 2015 3:23 AM | Updated on Sep 2 2017 10:33 PM

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పరీక్ష సెంటర్ అడ్రస్ మారడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు.

విద్యార్థుల సంఖ్య    50,655
 హాజరైనవారు         46,067
 గైర్హాజరైనవారు           4,588

 
కరీంనగర్ ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పరీక్ష సెంటర్ అడ్రస్ మారడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. నగరంలోని భారతి జూనియర్ కళాశాల కేంద్రం నంబర్ హాల్‌టికెట్‌లో కమాన్‌రోడ్ అని ఉండడం, కళాశాల కోతిరాంపూర్‌లోని బైపాస్‌రోడ్‌లో ఉండడంతో కాసేపు ఉరుకలు పరుగులు పెట్టారు. మొదటి రోజు పరీక్ష కావడంతో విద్యార్థుల వెంబడి వారి తల్లిదండ్రులు, బంధువులు కేంద్రాల వద్దకు తోడుగా వచ్చారు. దీంతో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కడ చూసినా జనం రద్దీ కనిపించింది.

నగరంలోని సైన్స్‌వింగ్ కళాశాలలో విద్యార్థులను పరీక్షలకు అనుమతించడంలో పక్షపాతం వహిస్తున్నారని ఆలస్యంగా వచ్చిన కొందరిని అనుమతించి మరికొందరి అడ్డుకున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఆర్‌ఐఓ సుహాసినితోపాటు పరీక్షల కేంద్రం అధికారులు సెంటర్‌ను సందర్శించి వివరాలు ఆరా తీశారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల నిర్వహణ సజావుగా సాగినప్పటికీ మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం పరీక్ష రాసేందుకు బెంచీలు ఏర్పాటు చేయకుండా కింద కూర్చోబెట్టి నిబంధనలను బేఖాతరు చేశారు. కళాశాలకు ఎక్కువ మంది విద్యార్థులను కేటాయించడంతో ఇరుకు గదులు సరిపోకపోవడంతో కింద కూర్చోబెట్టి పరీక్షలు నిర్వహించారు.
 
ఇద్దరు డిబార్...
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో సోమవారం ఇద్దరు విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ డిబార్ అయ్యారు. సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కోహెడలో ఒకరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ధర్మపురిలో ఒకరు, ఇద్దరు మాల్‌ప్రాక్టీసుకు పాల్పడుతూ పట్టుబడ్డట్లు ఆర్‌ఐఓ సుహాసిని వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా జనరల్ విభాగంలో 45,233 మందికి 41,691 మంది, ఒకేషనల్ విభాగంలో 5422 మందికి  4,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జనరల్, ఒకేషనల్ విభాగాల్లో జిల్లావ్యాప్తంగా 50,655 మంది విద్యార్థులకు, 46,067 మంది హాజరుకాగా, 4,588 మంది గైర్హాజరయ్యూరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement