జనగణనకు నాలుగంచెల వ్యవస్థ
మాస్టర్ ట్రైనర్లుగా గ్రూప్–1 అధికారులు..
జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు
ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి చేపట్టనున్న జాతీయ 16వ జనగణనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జనగణన చేపట్టే తేదీలను అధికారికంగా వెల్లడించనప్పటికీ ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది. జనగణనలో ప్రజల నుంచి తీసుకోవాల్సిన వివరాలతో కూడిన పట్టికను ఇప్పటికే జాతీయ జనగణన డైరెక్టరేట్ విడుదల చేయగా, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గెజిట్లో పునర్ముద్రించింది. దీంతోపాటు జనగణన చేపట్టే విధానానికి సంబంధించిన కొన్ని మార్గదర్శకాలను కూడా రూపొందించింది. ఈసారి జనగణన కోసం నాలుగంచెల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మొదటి అంచెలో జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు మాస్టర్ ట్రైనర్లను నియమిస్తోంది.
2021 డిసెంబర్ వరకు రిటైర్మెంట్ లేని గ్రూప్–1 అధికారులను ఇందుకోసం ఎంచుకుని వీరికి శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాతి దశలో గెజిటెడ్ హెడ్మాస్టర్లు, గణాంక అధికారులు, జీహెచ్ఎంసీ సిబ్బందిని ఎంపిక చేసుకుంటోంది. వీరు జనగణన సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఎన్యూమరేటర్లను పర్యవేక్షించనున్నా రు. ఎన్యూమరేటర్లుగా మండల, జిల్లా స్థాయిలో పనిచేస్తున్న టీచర్లను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వివరాల సేకరణకు పెన్ను, పేపర్ను ఉపయోగించకూడదని, మొబైల్ ఫోన్ యాప్తోనే వివరాలను నిక్షిప్తం చేయాలన్న జాతీయ జనగణన డైరెక్టరేట్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.