జెడ్పీ కార్యాలయం కోసం అధికారుల వేట | Telangana Gov Search To Zilla Parishad Office | Sakshi
Sakshi News home page

జెడ్పీ కార్యాలయం కోసం అధికారుల వేట

Jun 15 2019 12:06 PM | Updated on Jun 15 2019 12:06 PM

Telangana Gov Search To Zilla Parishad Office - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: నూతన జిల్లా పరిషత్‌ పాలక వర్గం ఏర్పాటైంది. కానీ ఆ పాలక వర్గానికి కార్యాలయం లేదు. జిల్లా పరిషత్‌ పాలకవర్గం కొలువుదీరేందుకు కొత్త జిల్లాల్లో జెడ్పీ భవనాలు ఏర్పాటు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం, జిల్లా పరిషత్‌ భవనం ఏర్పాటుకై అన్వేషణ మొదలుపెట్టింది. జూలై 5వ తేదీన నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టనుంది. ఈ లోపు జిల్లా పరిషత్‌ భవనాన్ని ఏర్పాటు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు పలు భవనాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 16 జెడ్పీటీసీలకు గాను 16 జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్‌ పార్టీనే దక్కించుకోవడంతో జిల్లా పరిషత్‌ పీఠం సైతం టీఆర్‌ఎస్‌ పార్టీనే దక్కించుకుంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతిని ఏకగ్రీవంగా    ఎన్నుకున్నారు.

అన్నీ కార్యాలయాలు అర్బన్‌లోనే..
వరంగల్‌ రూరల్‌ జిల్లాకు జిల్లా కేంద్రం లేకపోవడంతో అన్నీ కార్యాలయాలు అర్బన్‌ జిల్లాలోనే ఏర్పాటు చేశారు. అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల కాంప్లెక్స్‌ నూతన భవనం నిర్మాణం అవుతుండటంతో ప్రభుత్వ, అద్దె భవనాల్లోకి మార్చారు. రూరల్‌ జిల్లాకు చెందినవి సైతం కొన్ని ప్రభుత్వ భవనాల్లో, మరికొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు జిల్లా పరిషత్‌ కార్యాలయం కోసం వేట ప్రారంభించారు. అద్దె భవనంలో ఏర్పాటు చేయాలా....ఏదైన ప్రభుత్వ భవనం ఉంటే అందులో కార్యాలయం, మీటింగ్‌ హాల్‌ను ఏర్పాటు చేయాలా అని జిల్లా యంత్రాంగం ఆలోచిస్తున్నారు.

కొత్త జిల్లా ప్రతిపాదికనే..
కొత్త జిల్లాల వారీగా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేశారు.  గతంలో ఎన్నికైన జిల్లా, మండల పరిషత్‌ పాలకవర్గాల పదవీకాలం త్వరలో ముగుస్తుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాను ఆరు జిల్లాలుగా విభజించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌లు, 16 మండలాలున్నాయి. వీటిలో దామెర, నడికూడ మండలాలు ఏర్పాటు అయ్యాయి. పాత మండలాలకు మండల పరిషత్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఈ రెండు కొత్త మండలాలకు మండల పరిషత్‌ కార్యాలయాలు లేవు. రెండు కొత్త మండలాలకు సైతం మండల పరిషత్‌లు ఏర్పాటు చేసేందుకుందు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొనసాగుతున్న కసరత్తు
జిల్లాల విభజన, కొత్త మండలాల ఏర్పాటు, తండాలు, గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఒకొక్కటిగా విభజిస్తూ వస్తుంది. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. జిల్లాల విభజన జరిగినప్పటికీ జిల్లా పరిషత్‌ ఉమ్మడి జిల్లాల కిందనే కొనసాగుతూ వస్తున్నాయి. త్వరలో జెడ్పీటీసీ, ఎంపీటీసీల పదవికాలం ముగియనున్నందున ఆలోపు కొత్త జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త జెడ్పీ కార్యాలయానికి ప్రత్యేక భవనం కోసం సంబంధిత శాఖ అధికారుల పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది. హన్మకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిషత్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చే యాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.  జెడ్పీ కార్యాలయం కోసం మూడు భవనాలను పరిశీలించినట్లు సమాచారం. ఈ కార్యాలయాల నుంచే ఎన్నికల ప్రక్రియ కొనసాగించడంతో పాటు పాలకవర్గం కొలువుదీరేటట్లు భవనం సిద్ధం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement