ఉమ్మడి రాష్ట్రంలో వివక్షకు గురైయ్యాం | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 10:38 AM

Telangana Advocates Meets Congress Manifesto Committee - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తమ డిమాండ్లను ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల సంఘం కాంగ్రెస్‌ పార్టీకి వినతి పత్రం సమర్పించింది. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనరసింహంను కలిసి వారు వినతిపత్రాన్ని అందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో తాము ఎన్నో పోరాటాలు చేశామని, రాష్ట్రం ఏర్పడిన తరువాత తమకు పూర్తిగా స్థాయి న్యాయం జరగలేదని వారి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తాము ఎంతో వివక్ష గురయ్యామని, హైకోర్టు నియామకాల్లో కూడా తాము ఎంతో​ నష్టపోయామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తమ జీవితాలు బాగుపడాయని ఆశించామని, ఆ మేరకు న్యాయం జరగలేదని అన్నారు. న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని, జూనియర్‌ లాయర్లకు ఉపకార వేతనంగా ఐదేళ్లపాటు నెలకు రూ.10 వేలు అందించాలని కోరారు. న్యాయవాదుల కుటుంబానికి కూడా వర్తించే విధంగా ఐదు లక్షల ఇన్సురెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరారు. ఈ మేరకు న్యాయవాదుల సంఘం వినతి పత్రాన్ని సమర్పించారు. దానితోపాటు బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను, టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాంను కలిసి మ్యానిఫెస్టోలో తమ డిమాండ్లను పొందుపర్చాలని కోరారు. తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సీ దామోదర్‌ రెడ్డి, తెలంగాణ ఫెడరేషన్‌ ఆఫ్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కే అనంత్ రెడ్డితోపాటు తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు అనంతసేన్ రెడ్డి, బీ శంకర్, ఎంపీ భార్గవ్, పీ విష్ణువర్ధన్‌రెడ్డి, టీ హనుమంత్‌ రెడ్డి, బీ కొండారెడ్డి, ఆర్ జితేందర్ రెడ్డి.. కోదండరామ్‌ను కలిసిన వారిలో ఉన్నారు.


 

Advertisement
Advertisement