సేవలకు సత్కారం | Teachers Day Celebrations In Nizamabad | Sakshi
Sakshi News home page

సేవలకు సత్కారం

Sep 6 2018 11:26 AM | Updated on Oct 17 2018 6:10 PM

Teachers Day Celebrations In Nizamabad - Sakshi

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులందుకున్నవారితో ఎమ్మెల్సీ వీజీగౌడ్, కలెక్టర్‌ రామ్మోహన్‌రావు

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం విద్యా బోధనలో ఉత్తమ సేవలందిం చిన 25 మంది ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ విగంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ రెండేళ్లలో 574 రెసిడెన్సియల్‌ పాఠశాలలను ప్రారంభించామన్నారు.  కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ప్రభు త్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సుభాష్‌నగర్‌(నిజామాబాద్‌అర్బన్‌): సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఉపాధ్యాయ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించింది. నగరంలోని న్యూ అంబేద్కర్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ వి గంగాధర్‌ గౌడ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమంలో బోధించడం వల్ల డ్రాపౌట్స్‌ తగ్గి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందన్నారు. రెండేళ్లలో 574 రెసిడెన్సియల్‌ పాఠశాలలను ప్రారంభించామన్నారు. విదేశాల్లో చదివేందుకు వెళ్లే విద్యార్థులకు ప్రభుత్వం రూ.20 లక్షల విద్యానిధి కింద అందజేస్తుందన్నారు. తల్లిదండ్రులే మొదటి దేవుళ్లని, ఆ తర్వాత స్థానం గురువుకు దక్కుతుందని జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు అన్నారు.

జిల్లా పదోతరగతి ఫలితాల్లో గతేడాది రాష్ట్రంలో నాలుగో స్థానం సాధించగా, అంతకు ముందు 6వ స్థానం వచ్చిందని తెలిపారు. ఈ సంవత్సరం మరింత కృషి చేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలబెట్టడానికి ఉపాధ్యాయులు, ప్రధా నోపాధ్యాయులు పాటుపడాలన్నారు. జాతీయస్థాయిలో బోర్గాం పాఠశాలను తీర్చిదిద్ది అవార్డు అందుకుంటున్న హెచ్‌ఎం రామారావును మిగతా ప్రధానోపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు ఎన్నో సౌకర్యాలు కల్పింస్తోందన్నారు. ముఖ్యంగా మధ్యాహ్నభోజనం, దుస్తులు, పుస్తకాలు విద్యార్థులకు సమకూరుస్తున్నామని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు బోధన అందించాలని పేర్కొన్నారు.

తల్లిదండ్రుల కోరికలకనుగుణంగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మెరుగైన ఫలితాలకు ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నామన్నారు. మరోవైపు మాతృభాషను మరువకుండా విద్యార్థులకు తర్ఫీదునివ్వాలని సూచించారు. చదువుతోపాటు విద్యార్థులకు మంచి అలవాట్లు, క్రమశిక్షణ కూడా నేర్పాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి విద్యార్థి కనీససం ఆరు మొక్కలు నాటేలా చూడాలని, హరిత పాఠశాలలుగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గురువులంటే ఎంతో గౌరవమని, వారు ఎక్కడ కన్పించినా పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటానని నగర మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. 
కార్యక్రమంలో డీఈఓ నాంపల్లి రాజేష్, డైట్‌ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్, బీసీడీఓ శకుంతల, డీసీఈబీ కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇల్తెపు శంకర్, మోహన్‌రెడ్డి, రాజ్‌గంగారెడ్డి, సత్యానంద్, ఓ రమేష్, బీసీటీయూ వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement