పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు ....
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో కంగుతిన్న ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతోందని టీడీపీ విమర్శించింది. బల్దియా ఎన్నికలపై హైకోర్టు తీవ్రంగా స్పందించినా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదని ఆపార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గురువారం టీడీఎల్పీ కార్యాలయంలో దుయ్యబట్టారు. ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ప్రశ్నించినప్పుడల్లా ఆరు నెలల గడువు కావాలని కోరడాన్ని బట్టి ప్రభుత్వానికి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే వారి పాలన వదిలేసి ఎన్నికల వాయిదాకు అవకాశాలు వెతుక్కుంటోందని ఆయన మండిపడ్డారు. గ్రేటర్తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు, 10 మున్సిపాలిటీలకు వెంటనే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి తలసాని రాజీనామా ఆమోదింపజేసి సనత్నగర్కు ఉప ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటరు కార్డుకు ఆధార్ను అనుసంధానం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు.