ఆ ఆసుపత్రివన్నీ ఉల్లంఘనలే | Surrogacy clinic in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆ ఆసుపత్రివన్నీ ఉల్లంఘనలే

Jun 30 2017 12:18 AM | Updated on Aug 31 2018 8:34 PM

ఆ ఆసుపత్రివన్నీ ఉల్లంఘనలే - Sakshi

ఆ ఆసుపత్రివన్నీ ఉల్లంఘనలే

బంజారాహిల్స్‌లోని సాయికిరణ్‌ హాస్పిటల్‌–కిరణ్‌ సంతాన సాఫల్య కేంద్రం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని, సరోగసీ ద్వారా అది పక్కా వ్యాపారం

సరోగసీ ద్వారా పక్కా వ్యాపారం చేస్తోంది
సాయికిరణ్‌ ఆసుపత్రిపై హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని సాయికిరణ్‌ హాస్పిటల్‌–కిరణ్‌ సంతాన సాఫల్య కేంద్రం పలు ఉల్లంఘనలకు పాల్పడిందని, సరోగసీ ద్వారా అది పక్కా వ్యాపారం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. అల్ట్రాసౌండ్‌ స్కాన్స్, సంతాన సాఫల్యం కోసం అనుమతులు తీసుకుని సరోగసీ కేంద్రాలు నడుపుతోందని తెలిపింది. అంతేకాక ఈ ఆసుపత్రి శరణార్థి శిబిరాన్ని తలపిస్తోందని వివరించింది. ఆ ఆసుపత్రికి షోకాజ్‌ నోటీసు జారీ చేశామంది. ఈ కేంద్రంలో ఉన్న డాక్టర్‌ సమిత్‌శేఖర్‌ ఎంబీబీఎస్‌ వైద్యుడు మాత్రమేనని, ఎంబ్రోలజిస్ట్‌ సర్టిఫికేట్‌ను అతను చూపలేకపోయారని వివరించింది. అతనే మొత్తం సరోగసీ ప్రక్రియకు సంబంధించిన కార్యకలాపాలను పూర్తి చేస్తుంటారని వెల్లడించింది. గైనకాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, క్లినికల్‌ ఎంబ్రోలజిస్ట్, ఇతర కౌన్సెలర్లు లేకుండా ఈ ఆసుపత్రిని నడిపిస్తున్నారని పేర్కొంది.

ఆ తల్లుల పరిస్థితేమిటి?
సాయికిరణ్‌ హాస్పిటల్‌– కిరణ్‌ సంతాన సాఫల్య కేంద్రంలో సరోగసీ వ్యాపారం చేస్తున్నారంటూ పోలీసులు ఇటీవల ఆసుపత్రిని సీజ్‌ చేసినట్లు పత్రికల్లో వార్తలు వచ్చాయి. అక్కడ ఉన్న సరోగసీ తల్లుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌కుమార్‌ కెయిత్‌... తన ఆవేదనను లేఖ రూపంలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌ ముందుంచారు. ఆయన ఆదేశాల మేరకు ఈ లేఖను రిజిస్ట్రీ పిల్‌గా మలిచింది. దీనిపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది.

 ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది బీఎస్‌ ప్రసాద్‌ ఈ వ్యవహారానికి సంబంధించిన నివేదికను ధర్మాసనం ముందుంచారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. సరోగసీ తల్లులు ఉన్న సాయికిరణ్‌ ఆసుపత్రిని సీజ్‌ చేశారా? అని ప్రశ్నించింది. లేదని ప్రసాద్‌ తెలిపారు. ఒకవేళ మూసివేయాలని నిర్ణయం తీసుకుంటేæ, వారి పరిస్థితి ఏమిటన్నదే తమ ఆందోళనని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఒకవేళ ఆసుపత్రి మూసివేసినా తల్లుల సంరక్షణకు తాము అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ప్రసాద్‌ తెలిపారు.

ఇదే సమయంలో కొందరు సరోగసీ తల్లుల తరఫున, వారి గర్భంలో తమ బిడ్డలు ఉన్నారంటూ కొందరు దంపతులు దాఖలు చేసిన ఇంప్లీడ్‌ పిటిషన్లపై కూడా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సాయికిరణ్‌ ఆసుపత్రితో పాటు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తూ, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.  

నిపుణుల కమిటీ వేశాం...
ఆసుపత్రిలో మొత్తం 48 మంది సరోగసీ తల్లులు ఉన్నారని, వారు తమ శాశ్వత చిరునామాలను తెలియచేసేందుకు నిరాకరించారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 4 బెడ్ల సంతాన సాఫల్య కేంద్రం కోసం అనుమతి తీసుకుని, 50కి పైగా పడకల ఆసుపత్రి నిర్వహిస్తున్నారంది. సరోగసీ ఒప్పంద వివరాలు కూడా నమోదు చేయడం లేదంది. వీటిని బట్టి చూస్తే ఇక్కడ పిల్లల అక్రమ రవాణా జరుగుతుందేమోనన్న అనుమానం కలుగుతోందని తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని, వారు సరోగసీ తల్లులు, సరోగసీ కోసం వేచిచూస్తున్న మొత్తం 47 మంది మహిళలను పరీక్షించారంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement