ఆశ్రమ పాఠశాలల్లో ‘స్టీమ్‌ కుకింగ్‌’

ప్రారంభించనున్న గిరిజన సంక్షేమ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వంటశాలల రూపురేఖలు మారనున్నాయి. కట్టెల పొయ్యి, గ్యాస్‌ స్టవ్‌ల స్థానంలో స్టీమ్‌ కుకింగ్‌ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంధన భారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ హిత పద్ధతిలో వంటలు చేసేందుకుగాను స్మార్ట్‌ కిచెన్‌ల వైపు గిరిజన సంక్షేమ శాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు.  

1.2 లక్షల మంది విద్యార్థులు.. 
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం 319 ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. ఒక్కో పాఠశాలలో సగటున 4 వందల మంది కలిపి మొత్తంగా 1.20 లక్షల మంది విద్యార్థులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరికి నిర్దేశిత మెనూ ప్రకారం 3 పూటల భోజనం అందజేస్తున్నా.. వంట తయారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండటం.. అక్కడ గ్యాస్‌ సరఫరాలో సమస్యలు తలెత్తుతుండటంతో వంట చెరకుతో వంటలు చేస్తున్నారు. దీంతో పొగ ఎక్కవగా వెలువడటం, సిబ్బంది అనారోగ్యం పాలవడంతోపాటు వంట రుచిలో తేడాలొస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు స్టీమ్‌ కుకింగ్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ముందు 300 స్కూళ్లలో స్టీమ్‌ కుకింగ్‌ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ శాఖ అదనపు సంచాలకులు నవీన్‌ నికోలస్‌ వెల్లడించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top