అంగన్‌వాడీలకు ‘కొత్త’ కానుక | special gift to anganwadi centers | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు ‘కొత్త’ కానుక

Dec 26 2014 3:23 AM | Updated on Sep 2 2017 6:44 PM

అంగన్‌వాడీలకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఓ కానుకను ఇవ్వబోతుంది.

ఇందూరు: అంగన్‌వాడీలకు నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం ఓ కానుకను ఇవ్వబోతుంది. నెలల తరబడి బకాయిలు పడకుండా, ట్రెజరీలలో బిల్లులు ఆలస్యం కాకుండా, ఆన్‌లైన్ ద్వారా ప్రతి నెలా ఐదవ తేదీలోగా వేతనాలు అందించేందుకు ఐసీడీఎస్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో ఉన్న ఒక్క బటన్ నొక్కితే చాలు క్షణాలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకుల బ్యాంకు ఖాతాలలో వేతనాలు జమవుతాయి.  

ఇందుకోసం సిబ్బంది అందరితో బ్యాంకు ఖాతాలు తీయించి ఆ వివరాలను ఉన్నతాధికారులకు పంపించారు. వీటిని ఒక సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసి ఆన్‌లైన్ ద్వారా ఒకే సారి అందరికి వేతనాలతోపాటు టీఏలు కూడా అందే విధంగా కసరత్తు చేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు మాత్రం ఇంకా విడుదల కాలేదు. జనవరి నుంచి కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

తప్పనున్న ట్రెజరీ తిప్పలు
జిల్లాలోని పది సీడీపీఓల పరిధిలో మినీ, మెయిన్ మొత్తం 2,711 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 2400 పైగా కార్యకర్తలు, 2,350 పైగా సహాయకులు పని చేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు వేతనాలు, టీఏలను ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు శాఖకు పంపేవారు. వారు వాటిని ప్రాజెక్టులవారీగా విభజించి డీడీఓ ఖాతాలో వేసేవారు. వీటి    ని పొందాలంటే సీడీపీఓ ద్వారా బిల్లు తయారు చేసి, సంబంధిత ట్రెజరీలలో సమర్పించాల్సి ఉంటుంది. బిల్లులను ట్రెజరీ అధికారులు రెండు రోజులకు కానీ మంజూరు చేసేవారు కాదు. కొన్ని సమయాలలో కొర్రీలు పెట్టేవారు.

ఒక్కోసారి నెలల తరబడి పెండింగ్ ఉంచడంతో వేతనాలు పొందడం కష్టంగా మా రేది. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌పెట్టేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్ విధానం రూపొందించింది. ఆన్‌లైన్ వేతనాలను పొందాలంటే జిల్లానుంచి అంగన్‌వాడీల హాజరు శాతాన్ని ఉన్నతాధికారులకు పంపాల్సి ఉం టుంది. దానిని బట్టి వేతనాలు ఖాతాలో జమవుతా యి. అంగన్‌వాడీ కేంద్రం పేరుపై తీసిన ఖాతాల ద్వా రానేఇంటి  కిరాయలను చెల్లించనున్నారు. అంగన్‌వాడీల వేతనాలను ఆన్‌లైన్ ద్వారా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఐసీడీఎస్ పీడీరాము లు తెలిపారు. దీంతో అంగన్‌వాడీల పనితీరు కూడా కొంతవరకు మెరుగు పడుతుందన్నారు.

మూడు నెలల వేతనాలు విడుదల
అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు సంబంధించిన వేతనాలను విడుదల చేస్తూ ఐసీడీఎస్ డెరైక్టర్ అమ్రపాలి కాట బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పది ప్రాజెక్టులకు కలిపి రూ.3,39,77,746 విడుదలయ్యాయి.

ఆర్మూర్ ప్రాజెక్టుకు రూ.24,78,788, బాన్సువాడకు రూ.38,70,400, భీమ్‌గల్‌కు రూ.52,86,000, బోధన్‌కు రూ.50,77,006, దోమకొండకు రూ. 20,70,068, కామారెడ్డికి రూ.28,75,145, మద్నూర్‌కు రూ.24,78,788, నిజామాబాద్ రూరల్‌కు రూ. 69,00000, నిజామాబాద్ అర్బన్‌కు రూ. 12,69,748, ఎల్లారెడ్డికి రూ.16,71,803 కేటాయిం చారు. ఈ వేతనాలను పొందటానికి వెంటనే ట్రెజరీ లో బిల్లులు సమర్పించాలని ఐసీడీఎస్ పీడీ రాము లు సీడీపీఓలను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement