
కన్నకొడుకే కాలయముడు
జల్సాలు, చిల్లర దొంగతనాలకు అలవాటు పడిన ఓ యువకుడు డబ్బు, ఆస్తి కోసం కన్న తల్లినే అతి దారుణంగా హత్య చేశాడు.
ఆస్తి కోసం తల్లిని హత్య చేసిన వైనం
అల్లాదుర్గం రూరల్ : జల్సాలు, చిల్లర దొంగతనాలకు అలవాటు పడిన ఓ యువకుడు డబ్బు, ఆస్తి కోసం కన్న తల్లినే అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని అప్పాజిపల్లి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. జోగిపేట సీఐ రఘు కథనం మేరకు.. గ్రామానికి చెందిన శంకురి నర్సమ్మ (42)కు ఒక్కడే కుమారుడు శివకుమార్. తండ్రి చనిపోవడంతో తల్లే కూలీ పని చేస్తూ కుమారుడిని పోషిస్తోంది. అయితే శివకుమార్ జల్సాలకు అలవాటు పడి గ్రామంలో చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు.
ఈ క్రమంలో తల్లి నర్సమ్మను జల్సాల నిమిత్తం శివకుమార్ డబ్బును అడిగారు. ఇందుకు ఆమె తిరస్కరించింది. దీంతో కసి పెంచుకున్న శివకుమార్ ఆమెను హతమార్చాలని నిర్ణయించాడు. అందులో భాగంగానే అదే గ్రామానికి చెందిన తలారి పాండు సాయం తీసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఆదివారం రాత్రి నర్సమ్మను మాయమాటలు చెప్పి గ్రామ శివారులోకి తీసుకెళ్లారు. అనంతరం అక్కడ నర్సమ్మ నోట్లో గుడ్డలు కుక్కి ఆమె చీరతోనే ఉరేసి చంపారు. కాగా తన తల్లిని చంపి గండి చెరువులో ఉన్న తూటి పొదలో పడేసినట్లు శివకుమార్ సోమవారం ఉదయం గ్రామస్తులకు చెప్పారు. దీంతో వారు విషయాన్ని పోలీసులకు సమాచారం అందిస్తూ శివకుమార్ను చికతబాదారు. ఈ క్రమంలో శివకుమార్ అసలు విషయం బయటకు చెప్పాడు.
తన తల్లిని తలారి పాండే హత్య చేశాడని తెలిపాడు. ఈలోగా పోలీసులు గ్రామానికి చేరుకుని శివకుమార్ను అదుపులో తీసుకున్నారు. సీఐ రఘు డాగ్ స్క్వాడ్ రప్పించి విచారణ చేపట్టగా పోలీస్ డాగ్ మృతదేహం నుంచి మృతురాలి ఇంటికి, తలారి పాండు ఇంటి వరకు వెళ్లి ఆగింది. ఈ సందర్భంగా పోలీసులు నిందితుడు శివకుమార్ వద్ద ఉన్న మూడు సెల్ఫోన్లు, హత్యకు గురైన నర్సమ్మకు చెందిన బంగారు ఆభర ణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యకు గురైన నర్సమ్మ అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ విజయ్మోహన్ తెలిపారు. కాగి మరో నిందితుడు తలారి పాండు పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు.