త్వరలో  ‘షీ సేఫ్‌’ యాప్‌ 

SHE Safe Application Will Launch Soon In Telangana - Sakshi

రాష్ట్ర షీ టీమ్స్‌ ఇన్‌చార్జ్‌ స్వాతి లక్రా వెల్లడి 

గచ్చిబౌలి: మహిళల భద్రత కోసం త్వరలో ‘షీ సేఫ్‌’యాప్‌ను తీసుకురానున్నామని రాష్ట్ర షీ టీమ్స్‌ ఇన్‌చార్జ్‌ స్వాతి లక్రా పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద శనివారం రాత్రి సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ), సైబరాబాద్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ‘షీ సేఫ్‌ నైట్‌ వాక్‌’ను స్వాతి లక్రా, సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్, బ్యాడ్మింటన్‌ జాతీయ కోచ్‌ పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, పద్మశ్రీ పీవీ సింధు జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ... రాష్ట్రంతో పాటు నగరంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఐటీ కారిడార్‌లో రాత్రి సమయంలో విధులు నిర్వహించే మహిళల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, వారంతా పోలీసుల సహాయం లేకుండా సురక్షితంగా ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భద్రతపై మహిళలకు అవగాహన కల్పించేందుకే నైట్‌ వాక్‌ నిర్వహించామని పేర్కొన్నారు.

‘షీ సేఫ్‌ నైట్‌ వాక్‌’లో పాల్గొన్న ప్రజలు

సైబరాబాద్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ..ఐటీ కారిడార్‌లో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భద్రతపై మహిళలకు భరోసా కల్పించేందుకే షీ సేఫ్‌ నైట్‌ వాక్‌ను నిర్వహించామని తెలిపారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్, పుల్లెల గోపీచంద్‌ అకాడమీ వరకు అక్కడి నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వరకు షీ సేఫ్‌ నైట్‌ వాక్‌ కొనసాగింది. గైనకాలజిస్ట్, పద్మశ్రీ డాక్టర్‌ మంజుల అనగాని, నటి ఇషా రెబ్బా, ఎ‹స్‌సీఎస్‌సీ వైస్‌ చైర్మన్‌ భరణి కుమార్, సైబరాబాద్‌ షీ టీమ్స్‌ ఇన్‌చార్జ్, డీసీపీ అనసూయ, ఎస్‌సీఎస్‌సీ ఉమెన్‌ ఫోరం లీడర్‌ ప్రత్యూష, బిత్తిరి సత్తి, ఐటీ ఉద్యోగులు, పోలీసులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top