పరిశోధనలకు పదును పెట్టండి  | Sharpen to research says Venkiah Naidu | Sakshi
Sakshi News home page

పరిశోధనలకు పదును పెట్టండి 

Oct 9 2018 2:32 AM | Updated on Oct 9 2018 2:32 AM

Sharpen to research says Venkiah Naidu - Sakshi

సోమవారం వరంగల్‌లో జరిగిన నిట్‌ వజ్రోత్సవాల సభలో మాట్లాడుతున్న వెంకయ్యనాయుడు

కాజీపేట అర్బన్‌: దేశాభివృద్ధికి, మానవాళి మనుగడకు తోడ్పడేందుకు నూతన ఆవిష్కరణలను అందిస్తూ ఇన్నోవేషన్‌ హబ్‌గా నిట్‌ వరంగల్‌ మారాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. విద్యార్థులు ఆవిష్కరణలకు, పరిశోధనలకు పెద్దపీట వేయాలని పిలుపునిచ్చారు. కాజీపేటలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లోని అంబేడ్కర్‌ లెర్నింగ్‌ సెం టర్‌ ఆడిటోరియంలో సోమవారం నిట్‌ వ జ్రోత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు వజ్రోత్సవాల శిలాఫలకాన్ని, రూ.25 కోట్లతో పూర్వ విద్యార్థులు నిర్మించనున్న అల్యూ మ్ని కన్వెన్షన్‌ సెంటర్‌ శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆలోచనల ప్రతిరూపమే నిట్‌ అని, ప్రస్తుతం నిట్‌ వజ్రోత్సవాలను జరుపుకోవడం అభినందనీయమన్నారు.

తెలంగాణలో తనకు నచ్చిన ఏకైక జిల్లా వరంగల్‌ జిల్లా అని.. నాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు హెరిటేజ్‌ సిటీ వరంగల్‌ను, ఏపీలో అమరావతిని ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రకృతి సంపదను, కాకతీయుల వారసత్వాన్ని కాపాడుకుంటూ చరిత్రాత్మక చరిత్రగల ఓరుగుల్లును స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దాలని సూచించారు. అత్యాధునిక ల్యాబ్‌లతో, నిష్ణాతులైన అధ్యాపకులతో సాంకేతిక విద్యకు కేం ద్రంగా నిలుస్తూ ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక కళా శాలగా నిట్‌ వరంగల్‌ పేరుగాంచిందని ఆయన కొనియాడారు. పూర్వ విద్యార్థులు రూ.25 కోట్ల తో అల్యూమ్ని కన్వెన్షన్‌ సెంటర్‌ను అందించడం అభినందనీయమన్నారు.   

యువతకు ఉపాధినందించేందుకు స్కిల్‌ ఇండియా 
ఇంటికో ఉద్యోగమిస్తామనడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదని.. కొందరు హామీలు ఇచ్చినా అమలుకు నోచుకోవని ఉపరాష్ట్రపతి అన్నారు. ఇందు కోసం ప్రధాని మోదీ యువతకు ఉపాధినందించేందుకు స్కిల్‌ ఇండియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఉన్నత విద్యనభ్యసించి నిరుద్యోగులుగా మిగిలిపోకుండా స్వయం ఉపాధితో రాణించేందుకు స్కిల్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా లు తోడ్పడుతున్నాయని ఆయన వివరించారు. 

యువత ఎల్‌పీజీకి సిద్ధంగా ఉండాలి 
నేటి ఆధునిక యుగంలో గ్రామాలను వీడి ప్రజ లు ఉపాధి కోసం నగర బాట పడుతున్నా రని వెంకయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉపాధికి పోటీ పెరుగుతోందన్నారు. 2025లో ఎల్‌పీజీ (లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌) యు వత ఉపాధికి పోటీగా మారనుందన్నారు. ఎల్‌పీజీకి దీటుగా నిలిచేందుకు నూతన ఆవిష్కరణ లు, పరిశోధనలతో ముందుకు సాగాలన్నారు. 

చరిత్రాత్మక సందేశాన్ని అందించే బతుకమ్మ 
మానవ జీవితం ప్రకృతి ఒడిలో మమేకమైన చరిత్రాత్మక సందేశాన్ని బతుకమ్మ పండుగ అందిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రకృతిలో పువ్వులను ఒక రూపంగా మార్చి పూజించడం భారతీయ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అన్నారు.  తెలంగాణ పండుగలు జాతీయ సమైక్యతను తెలియపరుస్తుంటాయని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమానికి నిట్‌ రిజిస్ట్రార్‌ గోవర్దన్‌ అధ్యక్షత వహించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement