కేసీఆర్‌ ప్రకటనపై స్పందించిన జేఏసీ | RTC JAC Says We Will Continue Our Strike On RTC | Sakshi
Sakshi News home page

సీఎం డెడ్‌లైన్‌.. స్పందించిన జేఏసీ

Nov 3 2019 12:19 PM | Updated on Nov 3 2019 5:02 PM

RTC JAC Says We Will Continue Our Strike On RTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంగళవారం రాత్రిలోగా విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ డెడ్‌​లైన్‌ విధించిన నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కీలక భేటీ నిర్వహించింది. ఆదివారం ఉదయం నిర్వహించిన ఈ సమావేశం అనంతరం జేఏసీ కన్వీనర్‌ ఆశ్వాత్థామరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉద్యోగులను తొలగించే అధికారం ఎవరికీ లేదని, డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్‌ శనివారం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో తమ సమస్యల పరిష్కారంపై హామీ రాలేదని అన్నారు.



సమావేశం అనంతరం జేఏసీ నేతలు మాట్లాడారు.  సీఎం డెడ్ లైన్లు పెట్టడం కొత్తకాదని,  కోర్టులను సైతం సీఎం డిక్టేట్ చేస్తున్నారని విమర్శించారు. తొలుత చర్చలు జరిపి కార్మికులకు డెడ్ లైన్లుపెట్టాలని అన్నారు. ఉద్యోగాలు తీసే అధికారం సీఎంకు లేదని, డిపో మేనేజర్లు కూడా సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీలో కూడా రిజర్వేషన్లు అమలు ఉన్నాయని, ప్రైవేటు పరమైతే వెనకబడ్డ కులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్లకు బుగ్గ కారులో తిరగాలని సోకు లేదని, కార్మికుల డిమాండ్ల కోసమే యూనియన్లు పనిచేస్తున్నామని వివరించారు. ఇప్పటికైనా కార్మికులతో చర్చలు జరిపి సీఎం నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్మికులు నా బిడ్డలు అనుకుంటూనే కేసీఆర్ వారిని ఇబ్బంది పెడ్తున్నాడని మండిపడ్డారు. ఎవరో ఇద్దరు ముగ్గురు పిరికివాళ్లు ఉద్యోగంలో చేరుతున్నారని, కార్మికులందరూ సమ్మెలో పాల్గొంటున్నారని వెల్లడించారు. భేటీ సందర్భంగా జేఏసీ నేతలు భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement