సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ జేఏసీ నేతలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో శనివారం తెల్లవారుజామునుంచే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇక జూన్ రెండవ తేదీ నుంచి ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేపట్టనుంది. ఇక పీఆర్సీ విలీనంపై హైపవర్ కమిటీని వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మంత్రుల బృందం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య దాదాపు 12 గంటల పాటు చర్చలు జరిగాయి. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 ప్రధాన డిమాండ్లపై సుదీర్ఘ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 11 శాతం పీఆర్సీ ఇవ్వడంతో పాటు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆర్టీసీ సంఘాల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
ఇక ఆర్టీసీ జేఏసీ ప్రతిపాదించిన మిగిలిన సమస్యలను ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో ఆర్టీసీ జేఏసీ నేతలతో మంత్రుల బృందం భేటీ అయింది. సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ పాల్గొన్నారు.


