మూగజీవులు మనుషులకు మించి ప్రేమ, విశ్వాసాన్ని చూపిస్తాయి. అవసరమైతే తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టడమే గాదు..అలా రక్షించిన ఘటనలు కోకొల్లలు. తనకు ఎలాంటి ప్రమాదం లేదంటేనే రక్షించేందుకు ముందొకస్తాడు మనిషి. కానీ ఈ శునకం తనకు అపాయం అని తెలిసి చిన్నారుల కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టింది .
అసలేం జరిగిందంటే..ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో,కాళి అనే వీధి కుక్క చేసిన సాహసం అక్కుడున్న ప్రతి ఒక్కరిని కదిలించింది. అక్కడ పాఠశాల సమీపంలో ఆరుబయట సుమారు 30 మందికి పైగా చిన్నారులు ఆడుకుంటారు. తమ వైపు బుస్సు బుస్సు మని నిశబ్దంగా వస్తున్న ప్రమాదం గురించి వారికి ఏ మాత్రం తెలియదు. దాన్ని తత్క్షణమే పసికట్టిన కాళీ అనే వీధి కుక్క ఆ చిన్నారులందర్నీ కాపాడేందుకు ఆ విషసర్పంతో పోరాడేందుకు ముందుకు దూకింది.
ఆ పాము వైపుకి దూసుకెళ్లి మరి నిర్విరామంగా పోరాటం చేసింది. చిన్నారుల వైపుకి ఆ పాముని రానివ్వకుండా వీరోచితంగా పోరాడింది. చెప్పాలంటే ప్రమాదానికి పిల్లలకు మధ్య నిలబడి ఆ కాళి అనే కుక్కతో అపరకాళిలా పోరాడింది. పామును చంపేంత వరకు పోరాటం చేయడం విశేషం. అయితే ఆ పోరాటంలో ఆ పాము ఆ కుక్క ముఖం, నోటిపై కాటేసినా.. లెక్కచేయకుండా పోరాడి దాన్ని అక్కడ నుంచి తరిమికొట్టింది.
ఆ తర్వాత కొద్ది క్షణాలకే కుప్పకూలిపోయింది ఆ శునకం. అప్పటికే ఆ కుక్కకి తక్షణ సహాయం అందడంలో ఆలస్యమైపోయింది. ఆ విషం అప్పటికే దాని ప్రాణాలను బలిగొంది. ఒక్క బిడ్డకు కూడా హానికలగకుండా వీరోచితంగా పోరాడి యావత్తు గ్రామం మనసుని దోచుకుంది. నిజానికి ఆ కాళి అనే కుక్క వీది కుక్క కాదు, తమ రక్షకురాలు అని భావోద్వేగంగా అంటున్నారు స్థానికులు.
దాని త్యాగానికి గుర్తుగా మొత్తం గ్రామమే కదిలివచ్చి మరి వీడ్కోలు పలికారు. దాన్ని ఒక తెల్లటి వస్త్రంలో చుట్టి, పూలమాలతో అలంకరించి, గ్రామం గుండా అంత్యక్రియలకు ఊరేగింపుగా తీసుకువెళ్తూ..ఆ శునకానికి నివాళులు అర్పించారు. విశ్వాసంలో కుక్కకు మించిన వారు లేరని రుజువు చేసే ఘటన ఇది.
(చదవండి: జంతువుల నుంచి మనుషులకు ఏటా 5 కొత్త వ్యాధులు..!)


