సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. మంగళవారం ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీ జేఏసీ మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సమ్మెకు దిగింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో ప్రజా రవాణా స్తంభించనుంది. సమస్యలు పరిష్కరించేవరకు సమ్మె కొనసాగిస్తామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది.
ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం కార్మికుల సమస్యలపై సానుకూలంగా ఉందన్నారు. సమస్యల పరిష్కారానికి కనీసం 4 వారాల గడువు ప్రభుత్వం కోరిందని, దశలవారీగా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ సిద్ధంగా ఉందని తెలిపారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు లోనుకాకూడదని, కార్మికులు వెంటనే విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బాధ్యతగా వ్యవహరించాలని, దినసరి కూలీలు, సామాన్య ప్రజల ప్రయాణం దృష్టిలో పెట్టు కోవాలన్నారు. సంస్థ ప్రయోజనాల కోసం ఉద్యోగులు సహకరించాలని నాగిరెడ్డి కోరారు.
మరోవైపు సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీని చర్చలకు ఆహ్వానించింది. ప్రభుత్వంతో చర్చలు విఫలమైన తర్వాత ఆర్టీసీ జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. 'ప్రభుత్వానికి మా సమస్యలను వివరించాం. మా డిమాండ్లు అన్ని పాతవే.ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి చర్చలు అనడం కరెక్ట్ కాదు.
ఆర్టీసీ విలీనం, సంఘాల ఎన్నికలు, బస్సులు ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలన్నదే మా ప్రధాన డిమాండ్. కానీ కార్మిక జేఏసీ మా డిమాండ్లను పూర్తిగా పరిగణలోకి తీసుకోలేదు అటు చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేసింది. దీంతో అర్ధరాత్రి నుంచే రాష్ట్రంలో సమ్మె కొనసాగుతుంది ఎవరి ఒత్తిళ్లకు మేము తలొగ్గేది లేదు' అని పేర్కొన్నారు.
బుధవారం ఉదయం నుంచి ఆర్టీసీ సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బస్సులు నిలిచిపోనున్నాయి. ఫలితంగా ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే దాదాపు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్ తో పాటు ప్రధాన నగరాల్లో సామాన్య ప్రజలు, విద్యార్థులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను సమ్మె విరమించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని, అందుకే అధికారుల కమిటీని నియమించామని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. దాంతో, రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ డిపోల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరికొన్ని గంటల్లో సమ్మె ప్రారంభం కానుండటంతో ఏం జరుగుతుందన్నది? అనేది ఉత్కంఠగా మారింది.


