51 క్వింటాళ్ల పూలతో కేదార్‌నాథ్ ముస్తాబు | Kedarnath Blooms Sacred Shrine Ready to Reopen Tomorrow | Sakshi
Sakshi News home page

51 క్వింటాళ్ల పూలతో కేదార్‌నాథ్ ముస్తాబు

Apr 21 2026 11:54 AM | Updated on Apr 21 2026 12:07 PM

Kedarnath Blooms Sacred Shrine Ready to Reopen Tomorrow

కేదార్‌నాథ్: మంచు కొండల నడుమ నెలకొన్న మహా శివుని క్షేత్రం కేదార్‌నాథ్ అపూర్వ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శీతాకాలపు సుదీర్ఘ నిశ్శబ్దాన్ని వీడి, భక్తులకు ఆత్మీయ స్వాగతం పలికేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రతి ఏటా అత్యంత ఘనంగా జరిగే చార్‌ధామ్ యాత్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. రేపు (ఏప్రిల్ 22న) కేదార్‌నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో ఆ పుణ్యక్షేత్రమంతా శివనామస్మరణతో, భక్తి పారవశ్యంతో మారుమోగుతోంది.

పూల వనంలా పరమశివుని సన్నిధి
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన 51 క్వింటాళ్ల తాజా పూలతో కేదార్‌నాథ్ ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తున్నారు. ఈ పూల అలంకరణతో రాతి కట్టడమైన ఆ పవిత్ర మందిరం భక్తిభావానికి సజీవ సాక్ష్యంగా, కన్నుల పండువగా మారింది. అధికారులతో పాటు స్థానికులు సైతం అహర్నిశలు శ్రమిస్తూ, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా చేరుకున్న భక్తులు కూడా అధికారులకు సహకరిస్తూ వివిధ పనుల్లో స్వచ్ఛందంగా సేవలు అందిస్తుండటం విశేషం.

భద్రత కట్టుదిట్టం
భారీ సంఖ్యలో రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. మంచుతో కప్పుకుపోయిన నడక మార్గాలను పూర్తిగా క్లియర్ చేశారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ పద్ధతులను అమల్లోకి తెచ్చారు. యాత్రికుల భద్రత కోసం ప్రత్యేక బృందాలు అనునిత్యం పర్యవేక్షిస్తున్నాయి.

ఉత్సాహంగా చార్‌ధామ్ యాత్ర
ఏప్రిల్ 19న గంగోత్రి, యమునోత్రి ఆలయాల ప్రారంభంతో ఉత్తరాఖండ్ పవిత్ర చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది భక్తులు హిమాలయాలకు చేరుకున్నారు. రేపు (ఏప్రిల్ 22న) కేదార్‌నాథ్ ఆలయం తెరుచుకోనుండగా, ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 23న బద్రీనాథ్ ఆలయ ద్వారాలను సైతం భక్తుల దర్శనార్థం తెరవనున్నారు. 

ఇది కూడా చదవండి: ప్రపంచాన్ని వణికిస్తున్న ‘సూపర్ ఎల్‌ నినో’

Advertisement
 
Advertisement
Advertisement