ఆమాంతం పెరిగిన సన్ఫ్లవర్, వేరుశనగ, ఇతర నూనెల ధరలు
వారం, పది రోజుల్లో రూ.15-20
సాక్షి, హైదరాబాద్: వినియోగదారులు కొనకముందే వంట నూనెలు సలసలా కాగుతున్నాయి. ధరలు భగ్గుమంటున్నాయి. కొంతకాలంగా వ్యాపారులు ధరలు పెంచేయడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. విదేశాల నుంచి వంటనూనెల ముడిసరుకు దిగుమతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వంటనూనెల వినియోగంలో దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని అంటున్నారు. వంటనూనెల వినియోగంలో సన్ఫ్లవర్ ఆయిల్దే అగ్రస్థానం. ఆ తర్వాత వేరుశనగ, ఇతర నూనెలు ఉన్నాయి.
రెండు వారాల క్రితం సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ ధర రిటైల్ మార్కెట్లో రూ.175–185 ఉంది. వేరుశనగ నూనె ధర రూ.180 నుంచి 220కి ఎగబాకింది. మనదేశంలోకి థాయ్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి పామాయిల్, సన్ఫ్లవర్ ఆయిల్కు సంబంధించిన ముడిసరుకు దిగుమతి అవుతోంది. దిగుమతి చేసుకున్న ఆయిల్ను రిఫైనరీలు శుద్ధిచేసి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు.
రోజుకు వందల టన్నుల విక్రయం
నగరంలో రోజుకు వందల టన్నులకుపైగా వంటనూనె అమ్మకాలు జరుగుతున్నాయి. హోటళ్లు, క్లబ్బులు, బార్లలో అత్యధికంగా వివిధ రకాల వంటనూనెలు వినియోగిస్తుంటారు. హోల్సెల్ మార్కెట్ అన్ని రకాల నూనెలపై రూ.10 నుంచి రూ.15 పెరగడంతో ఇక రిటైల్, బహిరంగ మార్కెట్లో ప్రతీ లీటర్పై రూ.20 నుంచి రూ.25 పెరిగాయి.
ఇదీ చదవండి: 99.99 శాతం మందికి భవిష్యత్తే లేదు : జాక్మా సంచలన వ్యాఖ్యలు


