న్యూఢిల్లీ: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైంది. అగ్రరాజ్యం అమెరికాతో వాణిజ్య, రక్షణ, సాంకేతిక రంగాలలో కొత్త శకానికి నాంది పలుకుతూ, వాషింగ్టన్ డీసీ వేదికగా జరుగుతున్న తాజా చర్చలు అత్యంత వేగంగా, విజయవంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.
ముగింపు దశలో కీలక చర్చలు
వాషింగ్టన్ డీసీలో భారత్, అమెరికా ప్రతినిధుల మధ్య జరుగుతున్న తాజా వాణిజ్య చర్చలు అత్యంత సానుకూలంగా, ఉత్పాదక దిశగా కొనసాగుతున్నాయని అమెరికా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక చర్చల్లో భారత బృందానికి దర్పణ్ జైన్ నాయకత్వం వహిస్తుండగా, అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం తరపున బ్రెండన్ లించ్ నేతృత్వం వహిస్తున్నారు. ఒప్పందానికి సంబంధించిన ప్రధాన సమస్యలన్నీ ఇప్పటికే పరిష్కారమయ్యాయని, కేవలం కొన్ని చిన్నపాటి అంతరాలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. ‘ఎక్కువ భాగం పూర్తయింది, ఇక మిగిలి ఉన్నవి చాలా తక్కువే’ అని వారు పేర్కొన్నారు.
ఇరు దేశాలకు భారీ ప్రయోజనం
ఈ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎంతగానో మేలు చేస్తుందని అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిని ఇరువురికి లాభదాయకమైన ‘విన్-విన్’ ఒప్పందంగా ఆయన అభివర్ణించారు. సుంకాలు తగ్గించడం, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చాలా కాలంగా ఈ చర్చలు సాగుతున్నాయి. కాగా తాత్కాలిక ఒప్పందానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్పై ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు దేశాలు అంగీకారం తెలపడం ఈ డీల్లో కీలక ముందడుగు.
భవిష్యత్తును మార్చేలా బహుముఖ బంధం
ఈ ఒప్పందంలో భారతదేశ ప్రయోజనాలను పూర్తిగా కాపాడామని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. మొదటి దశ ఒప్పందం దాదాపు సిద్ధమైందని తెలిపిన ఆయన.. పోటీ దేశాలతో పోలిస్తే ఇది అత్యుత్తమ డీల్స్లో ఒకటిగా నిలుస్తుందని అన్నారు. భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడగలదని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని, సాంకేతికత, కీలక ఖనిజాలు, రక్షణ రంగాలలో భాగస్వామ్యంతో కూడిన బహుముఖ బంధమని ఆయన పేర్కొన్నారు. ఇది భవిష్యత్తును ఉజ్వలంగా మార్చే రెండు బలమైన దేశాల కలయిక అని అన్నారు.
ఇది కూడా చదవండి: ట్రంప్ సంచలన వార్నింగ్.. ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్


