మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్ | rtc employees ready to strike | Sakshi
Sakshi News home page

మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్

Apr 23 2015 3:48 AM | Updated on Oct 16 2018 2:49 PM

మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్ - Sakshi

మోగిన ఆర్టీసీ సమ్మె సైరన్

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. బుధవారం కార్మిక శాఖతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మే 6 నుంచి నిరవధికంగా సమ్మె చేయాలని ఏపీ, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. బుధవారం కార్మిక శాఖతో జరిగిన చర్చలు విఫలం కావడంతో మే 6 నుంచి నిరవధికంగా సమ్మె చేయాలని  ఏపీ, తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి.  రెండు తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న 1.20 లక్షల మంది ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ నెల 2న ఈయూ-టీఎంయూ నేతలు సమ్మె నోటీసిచ్చారు. దీనిపై రెండు సార్లు యాజమాన్యంతో, కార్మిక శాఖ అధికారులతో చర్చలు జరిగాయి. ఇవి విఫలం కావడంతో యూనియన్ నేతలు సమ్మె బాట పట్టారు.  తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగొచ్చేంతవరకు సమ్మె కొనసాగిస్తామని ఈయూ-టీఎంయూ నేతలు కె.పద్మాకర్, అశ్వత్థామరెడ్డిలు మీడియాకు తెలిపారు.

ఆర్టీసీ కార్మికులకు 2013 ఏప్రిల్ 1 నుంచి వేతనాల సవరణ జరగాల్సి ఉందని వివరించారు. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2014 ఫిబ్రవరి 1 నుంచి 27 శాతం ఇంటీరియం రిలీఫ్ ఇచ్చిందని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాల కోసం చేపడుతున్న ఈ నిరవధిక సమ్మెకు ఆర్టీసీలోని అన్ని కార్మిక సంఘాలు మద్దతివ్వాలని ఈయూ, టీఎంయూ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 24 నుంచి అన్ని డిపోలు, వర్కు షాపుల వద్ద సమ్మె సన్నాహక యాత్రలు నిర్వహించి కార్మికులను సమ్మెకు సిద్ధం చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించారు. ఆంధ్ర ఎన్‌ఎంయూ నేతలు ఎన్నికలు జరపాలన్న డిమాండ్ విరమించుకుని సమ్మెకు మద్దతు పలకాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement