ప్రజల్లో నమ్మకాన్ని పెంచాం | Revolutionary changes were made in the police department | Sakshi
Sakshi News home page

ప్రజల్లో నమ్మకాన్ని పెంచాం

Dec 31 2017 1:21 AM | Updated on Dec 31 2017 1:21 AM

Revolutionary changes were made in the police department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకాన్ని, ధైర్యాన్ని పెంచామని.. ఇందుకోసం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి రాష్ట్రంలో నమోదైన నేరాలు, ఇతర అంశాలపై శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో నేరాలపై ఫిర్యాదులు పెరిగాయని, ప్రజల్లో పోలీసులంటే నమ్మకం ఏర్పడటమే దీనికి కారణమని డీజీపీ చెప్పారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 12.93 శాతం నేరాల పెరుగుదల కనిపిస్తోందని అన్నారు. గ్యాంగ్‌లు, వ్యవస్థీకృత నేరాలను పక్కాగా నియంత్రించామని, మహిళా రక్షణ విషయంలో గణనీయమైన ఫలితాలు సాధించామని చెప్పారు. పోలీసులు యూనిఫాం ధరించిన అధికారులైతే, ప్రజలు యూనిఫాం లేని అధికారులుగా మారాలని డీజీపీ పేర్కొన్నారు.

ప్రజల సహకారంతోనే విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సభలు, సమావేశాల వంటి పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలతోపాటు బోనాలు, గణేశ్‌ నిమజ్జనం, రంజాన్‌ వంటి పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ çపక్కాగా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టిందని డీజీపీ చెప్పారు. ఇదంతా ప్రజల సహకారంతోనే సాధ్యమైందన్నారు.  

చిన్నారుల కళ్లలో వెలుగు..
సీఐడీ నేతృత్వంలో అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో నిర్వహిస్తున్న ఆపరేషన్‌ ముస్కాన్, ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమాల ద్వారా మంచి ఫలితాలు సాధించినట్టు డీజీపీ తెలిపారు. ఆపరేషన్‌ స్మైల్‌ 3వ దఫాలో 4,374 మంది చిన్నారులను బాల కార్మిక కూపాల నుంచి రక్షించినట్లు తెలిపారు.

1,502 మంది చిన్నారులను రాష్ట్రంలో తల్లిదండ్రులకు అప్పగించామని, 2,872 మంది చిన్నారులను వారి సొంత రాష్ట్రాలకు పంపించామని వెల్లడించారు. ఇక ఆపరేషన్‌ ముస్కాన్‌ 3వ దఫాలో 2,572 మంది చిన్నారులను కాపాడామన్నారు. వీరిలో 999 మంది చిన్నారుల తల్లిదండ్రులను గుర్తించి అప్పగించామని.. మిగతా చిన్నారులను వారి సొంత రాష్ట్రాలకు అప్పగించామని తెలిపారు.

ఆందోళన కల్గిస్తున్న అక్రమ రవాణా..
మహిళల అక్రమ రవాణా ఆందోళనకరంగా పరిణమించిందని డీజీపీ పేర్కొన్నారు. సీఐడీ 2016లో 327 మందిని రక్షించగా.. ఈ ఏడాది నవంబర్‌ వరకు 394 మందిని రెస్క్యూ చేసిందని తెలిపారు.

2016లో అక్రమ రవాణాపై 207 కేసులు నమోదుచేసి 245 మందిని అరెస్టు చేయగా.. ఈ ఏడాది నవంబర్‌ వరకు 262 మంది నిందితులను గుర్తించి 238 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇక ఆర్థిక నేరాలకు సంబంధించి 2016లో 7,987 కేసులు నమోదుకాగా.. ఈ ఏడాది నవంబర్‌ వరకు 9,418 నేరాలు నమోదయ్యాయని చెప్పారు. రాష్ట్రంలో జాతీయ, రాష్ట్ర రహదారులపై రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వెల్లడించారు.


జిల్లా యూనిట్లకు ‘కొత్త’ శోభ
కొత్త జిల్లాల్లోని పోలీస్‌ యూనిట్లకు వచ్చే ఏడాది చివరికల్లా నూతన కార్యాలయాలు అందుబాటులోకి వస్తాయని డీజీపీ తెలిపారు. అత్యాధునిక సౌకర్యాలతో జిల్లా పోలీస్‌ హెడ్‌క్వార్టర్లు, కమిషనరేట్లు, క్వార్టర్లను నిర్మిస్తున్నామని తెలిపారు. పోలీసు సంక్షేమం విషయంలో ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని.. పోలీస్‌ వెల్ఫేర్‌ విభాగం ద్వారా ఈ ఏడాది 346 మంది రూ.2.56 కోట్లు రుణం తీసుకున్నారని చెప్పారు.  


మావోయిస్టులను నియంత్రించాం
మావోయిస్టు కార్యకలాపాలు, ఉగ్రవాదులను నియంత్రించడంలో పోలీస్‌ శాఖ విజయవంతమైందని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబర్‌ నాటికి 54 మంది మావోయిస్టులను అరెస్ట్‌ చేయగా.. 26 మంది లొంగిపోయారని తెలిపారు. అదేవిధంగా 10 ఎదురుకాల్పుల ఘటనలు జరిగాయని, ఐదుగురు మరణించారని తెలిపారు.

వివిధ ఆపరేషన్స్‌లో 16 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని.. అందులో నాలుగు ఏకే 47 రైఫిళ్లు, రెండు ఎస్‌ఎల్‌ఆర్‌ తుపాకులు, ఒక ఎస్‌బీబీఎల్, మూడు పాయింట్‌ 303 రైఫిల్‌లు, మూడు పిస్టళ్లు, ఒక తపంచా, రెండు ఇన్సాస్‌ తుపాకులు ఉన్నాయని వెల్లడించారు. అదేవిధంగా రూ. 20.64 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. కర్ణాటక, రాజస్తాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన పోలీసులతో కలసి మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు తెలిపారు. హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్‌ ముఠాలను, నకిలీ కరెన్సీ గ్యాంగులను పట్టుకున్నట్టు చెప్పారు.


త్వరలో భారీ రిక్రూట్‌మెంట్‌
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే పోలీసు శాఖకు 18,290 పోస్టులు మంజూరు చేసిందని డీజీపీ తెలిపారు. 3,897 పోస్టులకు త్వరలో నియామక ప్రక్రియ చేపట్టబోతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం 10 వేల మంది కానిస్టేబుళ్లు, 500 మంది ఎస్సైలు శిక్షణ పొందుతున్నారని, ఫిబ్రవరి తొలివారంకల్లా ఈ కానిస్టేబుళ్లు విధుల్లోకి వస్తారని చెప్పారు. దీనివల్ల ప్రస్తుత సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుందని, వీక్‌–ఆఫ్‌ ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement