16 నుంచి రేషన్‌ షాపుల మూసివేత

Ration shops close from 16th - Sakshi

15 లోగా ప్రభుత్వం స్పందించకుంటే షాపులు బంద్‌

పెద్ద అంబర్‌పేట గర్జనసభలో రేషన్‌ డీలర్ల హెచ్చరిక

పెద్దఅంబర్‌పేట(ఇబ్రహీంపట్నం): రేషన్‌ డీలర్లు గర్జించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను ఆమోదించాలని నిరసన గళం వినిపించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 16 నుంచి రేషన్‌షాపులను మూసివేయనున్నట్లు రాష్ట్ర రేషన్‌ డీలర్ల ఉమ్మడి కార్య నిర్వహణా సంఘం ప్రతినిధులు ప్రకటించారు. రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రం గారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం రేషన్‌ డీలర్ల గర్జన సభ నిర్వహించారు. సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వేలాది మంది డీలర్లు్ల తరలివచ్చారు.

రేషన్‌ డీలర్లకు ప్రతినెలా రూ.30 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో జూలై 1 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రేషన్‌ డీలర్ల సమస్యలపై నాలుగేళ్లుగా పౌర సరఫరాల అధికారుల కు వినతిపత్రాలు సమర్పించినా సమస్యలు పరిష్కరించ కుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మూడు దశాబ్దాలుగా ప్రభుత్వాలకు, ప్రజలకు మ«ధ్య వారధిగా ఉంటూ ఎన్నో ప్రభు త్వ పథకాలను విజయవంతం చేసినా ప్రభు త్వాలు తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

నూతనంగా ప్రవేశపెట్టిన ఈ పాస్‌ విధానానికి తాము వ్యతిరేకం కా దని, అదే సమయంలో తమ సంక్షేమం గురిం చి కూడా ఆలోచించాలన్నారు. కొన్నేళ్లుగా రేషన్‌ డీలర్లు రెండు సంఘాలుగా ఏర్పడడంతో ఐకమత్యం లోపించిందని, ఇదే అదునుగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం రేషన్‌ డీలర్ల తో చెలగాటం ఆడిందని, రెండు సంఘాలు ఒక్కటయ్యాయ ని, ఇక నుంచి ప్రభుత్వ ఆటలు కొనసాగవని అన్నారు. ఈ నెల 15లోపు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థ ఒకే విధంగా కొనసాగుతుంటే తెలంగాణలో మాత్రం భిన్నంగా నడుస్తోందన్నారు. మూడు రకాల వస్తువులనే పంపిణీ చేస్తుండగా, వాటిల్లో డీలర్లకు ప్రభుత్వం ఇచ్చే కమీషన్‌ ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. సమ్మెను దృష్టిలో పెట్టుకుని రేషన్‌ డీలర్లు డీడీలను చెల్లించవద్దని సూచించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, ప్రతినిధులు బత్తుల రమేశ్‌బాబు, మాధవరావు, దాసరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

తీర్మానాలు ఇవీ..
రేషన్‌ డీలర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి.  
 రూ.416 కోట్ల కమీషన్‌ బకాయిలను జూలైలో విడుదల చేయాలి.
 డీలర్ల కుటుంబసభ్యులకు హెల్త్‌కార్డులు జారీ చేయాలి.  
ఇళ్లులేనివారికి ఇళ్లు, ఇళ్లస్థలాలు ఇవ్వాలి.  
 ఎలక్ట్రానిక్‌ యంత్రంపై బియ్యం తూకం వేసి సరఫరా చేయాలి.  
 ప్రజలకు అవసరమైన అన్ని సరుకులను రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేయాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top