దిగొచ్చిన రేషన్‌ డీలర్లు | Ration dealers back step | Sakshi
Sakshi News home page

దిగొచ్చిన రేషన్‌ డీలర్లు

Dec 3 2017 3:10 AM | Updated on Dec 3 2017 3:10 AM

Ration dealers back step - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్లు పరిష్కరించా లంటూ సమ్మె బాట పట్టిన పౌరసరఫరాల రేషన్‌ డీలర్లలో చాలామంది ప్రభుత్వ హెచ్చ రికతో వెనక్కి తగ్గారు. సరుకులు తీసుకోని డీలర్లను తొలగించి వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సీఎం ఆదేశించడం, డిసెంబర్‌ నెల సరుకుల కోసం శనివారం లోగా డీడీలు కట్టాలని పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డీలర్లు డీడీలు కట్టడంలో మునిగిపోయారు. శనివారం సాయంత్రం వరకు 13 వేల 200 మంది డీలర్లు డీడీలు కట్టారు.

రాష్ట్రవ్యాప్తంగా 17 వేల 200 రేషన్‌ దుకాణాలుండగా వాటిలో వెయ్యి షాపులకు రెగ్యులర్‌ డీలర్లు లేరు.   మరో 3 వేల మంది డీలర్లు మాత్రమే డీడీలు చెల్లించాల్సి ఉంది. మంచిర్యాల, కరీంనగర్, వరంగల్‌ జిల్లాల్లో మాత్రమే ఎక్కువ మంది డీలర్లు డీడీలు కట్టలేదని చెబుతున్నారు. అయితే మీ–సేవా కేంద్రాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల వల్ల కొందరు డీడీలు కట్టేలక పోయారని తెలుస్తోంది. డీలర్లు సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఈ నెల సరుకుల పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది.

తాజాగా చాలామంది డీలర్లు డీడీలు కట్టిన నేపథ్యంలో సరుకుల పంపిణీకి ఇబ్బందులు తొలగిన ట్లేనని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నెల డీడీలు కట్టేందుకు డీలర్లకు 4వ తేదీ వరకు గడువు పెంచాలని, డీలర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం  రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు, సభ్యుడు ఆనంద్‌ శని వారం పౌర సరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్‌సీవీ ఆనంద్‌లను కలిసి విజ్ఞప్తి చేశారు. డీలర్లందరూ డీడీలు కట్టాలని సంఘం తరఫున కోరుతున్నామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement