శిశువు మృతదేహాన్నికొరికిన ఎలుకలు | Rat eaten the kid's dead body | Sakshi
Sakshi News home page

శిశువు మృతదేహాన్నికొరికిన ఎలుకలు

Feb 3 2018 3:27 AM | Updated on Sep 2 2018 5:06 PM

నర్సాపూర్‌: పోస్టుమార్టం గదిలో ఉన్న మూడు నెలల శిశువు మృతదేహాన్ని ఎలుకలు కొరికాయి. ఈ హృదయ విదారక ఘటన మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. కౌడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బతుకమ్మ తండాకు చెందిన సురేఖ, కిషన్‌ దంపతుల కూతురు పుట్టిన కొన్ని రోజులæ నుంచి అనారోగ్యంతో ఉంది. గురువారం ఉదయం మరోసారి అస్వస్థతకు గురవడంతో వైద్యం చేయించేందుకు సురేఖ మెదక్‌కు వెళుతుండగా పాప మార్గమధ్యంలో మృతి చెందింది.

శిశువు తండ్రి కిషన్‌తోపాటు అతడి తరఫువారు గురువారం సాయంత్రం వరకు రానందున మృతదేహాన్ని నర్సాపూర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదిలో పెట్టి తాళం వేశారు. శుక్రవారం ఉదయం మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు వైద్య సిబ్బంది వెళ్లి చూసేసరికి శిశువు మృతదేహంపై పలు చోట్ల గాయాలు కనిపించాయి.

ఎలుకలు కొరికిన విషయాన్ని శిశువు కుటుంబీకులకు చెప్పకుండా పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని వారికి అప్పచెప్పారు. అయితే శిశువు మృతదేహంపై కుడి వైపు పెదవిని, చెంపతోపాటు ఎడమ చేయి వేలును కొరికాయి. అంతేగాక కుడికాలు తొడపై సైతం గాయమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని   కౌడిపల్లి ఎస్‌ఐ శ్రీనివాస్‌ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement