ఉలిక్కిపడ్డ నారాయణపేట

Priyanka Murder Case: Four Accused Hailed From Narayanpet - Sakshi

ప్రియాంకారెడ్డిని హత్య చేసిన నిందితులు జిల్లా వాసులే

జక్లేర్, గుడిగండ్లలో కలకలం 

నారాయణపేట/మక్తల్‌: వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డిని హత్య చేసిన నిందితులు నారాయణపేట జిల్లా వాసులుగా తేలడంతో ఆ ప్రాంతం ఉలిక్కిపడింది. మక్తల్‌ మండలం జక్లేర్, గుడిగండ్లకు చెందినవారే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని టీవీలు, సోషల్‌ మీడియాలో రావడంతో అక్కడి జనం విస్తుపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంట లకే మక్తల్‌ మండలం జక్లేర్, గుడిగండ్లకు వెళ్లిన షాద్‌నగర్‌ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం విషయం తెలియడంతో నవీన్, చెన్నకేశవులు కుటుంబ స భ్యులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. గుడిగండ్లకి చెందిన నవీన్, చెన్నకేశవులు, శివ కలిసి తిరిగేవారు. నవీన్‌కుమార్‌ ద్విచక్రవాహనంపై డేంజర్‌ అనే సింబల్‌ ఉంటుంది. ఈ హత్య గురించి తెలియడంతో ‘ఆ డేంజర్‌ గాళ్లా.. ఈ పని చేసింది’ అని గ్రామంలో చర్చించుకుంటున్నారు. 

బంక్‌లో పనిచేస్తూ లారీ డ్రైవర్‌గా పాషా
మక్తల్‌ మండలం జక్లేర్‌కు చెందిన హుస్సేన్, మౌలానీబీ దంపతుల కుమారుడు మహ్మద్‌ పాషా అలియాస్‌ ఆరిఫ్‌ పదో తరగతి వరకు చదివాడు. తొలుత పెట్రోల్‌ బంకులో పనిచేశాడు. తర్వాత హైదరాబాద్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  మద్యానికి బానిస అయ్యాడు. ప్రియాంకను హత్య చేసిన తర్వాత గురువారం రాత్రి పాషా జక్లేర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో షాద్‌నగర్‌ పోలీసులు వచ్చి పాషాను లేపి అదుపులోకి తీసుకున్నా రు. ఎందుకు తీసుకెళ్తున్నారని తల్లిదండ్రులు అడగడంతో.. ‘లారీకి యాక్సిడెంట్‌ జరిగింది.. అందుకే తీసుకెళ్తున్నారంటూ పాషానే చెప్పినట్టు అతడి తల్లిదండ్రులు తెలిపారు. మధ్యాహ్నం ప్రియాంకను మీ కుమారుడే హత్య చేశాడని గ్రామస్తులు చెప్పడంతో.. ‘మా వాడు మంచోడు.. ఎవరో ఇలా చేశారు’అంటూ విలపించారు. 

జులాయిగా నవీన్‌.. 
గుడిగండ్లకు చెందిన నవీన్‌ తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయాడు. అప్పటి నుంచి నవీన్‌ జులాయిగా తిరిగేవాడని గ్రామస్తులు తెలిపారు. నవీన్‌ తన బైక్‌ను స్పోర్ట్స్‌ బైక్‌లా మార్చుకోవడంతోపాటు హెడ్‌లైట్‌ తీసేసి ఆ ప్లేస్‌లో డేంజర్‌ అని బొమ్మ వేసుకున్నాడు. చెన్నకేశవులు, శివలతో కలిసి జులాయిగా తిరిగేవాడు. కుటుంబ పోషణ భారం కావడంతో పాషాతో కలిసి నవీన్‌ కూడా లారీ క్లీనర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. 

ఈ పాడు పనేంటి చెన్నకేశవా? 
గుడిగండ్లకు చెందిన జయమ్మ, కుర్మయ్యల ఒకే ఒక్క కుమారుడు చెన్నకేశవులు. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నవీన్‌తో పాటు చెన్నకేశవులు కూడా లారీ డ్రైవర్‌గా హైదరాబాద్‌లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం చెన్నకేశవులు భార్య గర్భిణి. పెళ్లయి ఇంట్లో భార్యను పెట్టుకుని ఈ పని చేశాడేంటి అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. 

జీతం తెస్తాడనుకుంటే జైలుకెళ్లాడు.
గుడిగండ్లకు చెందిన రాజప్ప, మణెమ్మ రెండో కుమారుడు శివ. నవీన్‌కుమార్, చెన్నకేశవులు, జక్లేర్‌కు చెందిన పాషాలు డ్రైవర్లు కావడంతో రెండు నెలల క్రితం వారి వద్ద క్లీనర్‌గా చేరాడు. కర్ణాటకలో గొర్రెల కాపరిగా పనిచేసే శివ తండ్రి ఈనెల 26న ఇంటికి వచ్చాడు. జీతం ఏమైందంటూ శివను అడగ్గా.. రెండు, మూడు రోజుల్లో తెస్తానని చెప్పి మంగళవారం బయలుదేరి వెళ్లాడు. తిరిగి గురువారం రాత్రి ఇంటికి వచ్చాడు. మావాడు జీతం తెచ్చి ఉంటాడని ఆ తల్లిదండ్రులు అనుకోగా.. తెల్లవారుజామున పోలీసులు వచ్చి తీసుకెళ్లడంతో హతాశులయ్యారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top