కట్టుకున్న భర్తను, కన్నబిడ్డలను వదిలి ప్రియుడితో కొత్త జీవితం ప్రారంభించాలని భావించిన ఓ మహిళ.. చివరకు ఊహించని రీతిలో జైలు పాలైంది. తన సహజీవనానికి అడ్డుగా ఉందనే అనుమానంతో ఆరేళ్ల చిన్నారిని హత్య చేయడమే కాదు.. ప్రియుడి మాయమాటలకు నమ్మి జీవితాన్నే నాశనం చేసుకుంది. బెంగళూరులో సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..
దావణగెరెకు చెందిన ప్రవీణ్, ప్రియాంక దంపతులకు 2007లో వివాహమైంది. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రవీణ్ విద్యాసంస్థ నిర్వహిస్తుండగా, ప్రియాంక న్యాయవాదిగా పనిచేస్తున్నారు. 2025 చివర్లో కుటుంబానికి చెందిన 25 ఎకరాల భూమి వివాదానికి సంబంధించిన కేసు పనిమీద బెంగళూరు వెళ్లిన ప్రియాంక.. కాలేజీ రోజుల స్నేహితుడు, ఒకప్పుడు ప్రేమించిన మోహన్ను మళ్లీ కలిసింది.
తాను రూ.1,000 కోట్ల ఆస్తులున్న రియల్ ఎస్టేట్ వ్యాపారినని మోహన్ నమ్మబలికాడు. అంత ఆస్తి ఉందని చెప్పడంతో ఆమె అతనికి ఆకర్షితురాలైంది. క్రమంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెంగళూరు నుంచి తిరిగొచ్చిన తర్వాత భర్త ప్రవీణ్పై విడాకుల కోసం ఒత్తిడి తెచ్చిన ప్రియాంక.. చివరకు ఇంటిని విడిచి వెళ్లిపోయింది.
విడిపోయిన తర్వాత పెద్ద కుమార్తె తండ్రి వద్ద ఉండగా, చిన్నారి వెన్నెల మాత్రం ప్రియాంకతో కలిసి బెంగళూరులోని సీగేహళ్లిలో అద్దె విల్లాలో నివసిస్తోంది. ఈ క్రమంలో మార్చి 24న వెన్నెల పుట్టినరోజు వేడుకలు జరిపిన ప్రియాంక.. బిర్యానీ, ఐస్క్రీం తినిపించిన తర్వాత చిన్నారిని కారులోనే వదిలేసి ప్రియుడు మోహన్తో కలిసి కాఫీ షాప్కు వెళ్లినట్లు చెప్పింది. మరుసటి రోజు వెన్నెల నిద్రలేవకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనారోగ్యంతో చిన్నారి మరణించిందని కుటుంబ సభ్యులకు చెప్పి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే బిడ్డ మృతిపై అనుమానంతో ప్రవీణ్ పోస్ట్మార్టం నివేదికను పరిశీలించాడు. ఆ నివేదికను విదేశాల్లో పనిచేస్తున్న తన డాక్టర్ సోదరికి చూపించగా, అందులో అనేక లోపాలు ఉన్నాయని ఆమె గుర్తించింది. దీంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు.
దర్యాప్తులో వెన్నెలది సహజ మరణం కాదని, గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ భవిష్యత్తుకు చిన్నారి అడ్డుగా మారిందనే కారణంతో ప్రియాంక, మోహన్ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మోహన్ను అరెస్టు చేశారు. అయితే అప్పటి నుంచి పరారీలో ఉన్న ప్రియాంకను గురువారం హాసన్లో అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ప్రియాంక, మోహన్లు కాశీలో రహస్యంగా వివాహం చేసుకున్నారట. ఆ తర్వాత దుబాయ్లో నూతన సంవత్సర వేడుకలు కూడా జరుపుకున్నారని తెలుస్తోంది. వెన్నెల కేసు దర్యాప్తులో మరో షాకింగ్ విషయం బయటపడింది. తాను కోటీశ్వరుడినని చెప్పిన మోహన్ వాస్తవానికి పెద్ద వ్యాపారి కాదని, అద్దె ఇళ్ల బ్రోకర్గా పనిచేస్తున్నాడని తేలింది. అతని మాటలు నమ్మి కుటుంబాన్ని వదిలేసిన ప్రియాంక.. చివరకు కన్నకూతురి హత్య కేసులో నిందితురాలిగా కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.


