పోలింగ్‌ సామగ్రికి పటిష్ట భద్రత | Poling Machines Went to Counting Places | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ సామగ్రికి పటిష్ట భద్రత

Dec 8 2018 3:24 PM | Updated on Dec 8 2018 3:24 PM

Poling Machines Went to Counting Places - Sakshi

పాల్వంచ : అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని పాల్వంచలోని అనుబోస్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్‌ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా అక్కడ పటిష్ట భధ్రత చర్యలు చేపట్టారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో మొత్తం 71 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. జిల్లాలోని 995 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. కొన్ని చోట్ల ఓటర్లు సాయంత్రం కూడా బారులుదీరి ఉండటంతో ఓటింగ్‌ ఆలస్యం అయింది. అనంతరం మారుమూల ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈవీఎంలు, వీవీప్యాట్లను కౌంటింగ్‌ కేంద్రానికి కట్టుదిట్టమైన భద్రత నడుమ తరలించారు.
  
ఉన్నతాధికారుల పర్యవేక్షణ... 
కౌంటింగ్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ రజత్‌ కుమార్‌ శైనీ, ఎస్పీ సునీల్‌దత్, జాయింట్‌ కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ భవేష్‌ మిశ్రా, డీఎస్పీలు కుమారస్వామి, మధుసూదన్‌రావు పర్యవేక్షణ చేస్తున్నారు. పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన ఈవీఎంలను ఆన్‌లైన్‌ చేయడంతో పాటు బ్యాలెట్‌ యూనిట్‌లను కేటగిరీల వారీగా ఏర్పాటు చేశారు.  కౌంటింగ్‌ కేంద్రం చుట్టూ సీసీ కెమెరాలు, వెబ్‌ కెమెరాలను అమర్చారు. స్ట్రాంగ్‌ రూంలకు విద్యుత్‌ సరఫరా లేకుండా చేశారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు, షార్ట్‌సర్క్యూట్‌ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.  సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల లెక్కింపు తీరును బయట నుంచి ఆయా అభ్యర్థులు, అధికారులు పరిశీలించేలా బయట ప్రొజెక్టర్‌లను కూడా ఏర్పాటు చేయనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement