2022 నాటికి  ప్లాస్టిక్‌ను నిషేధిస్తాం..

Plastic Will Be Banned By 2020 Says Jogu Ramanna - Sakshi

ఎదులాపురం(ఆదిలాబాద్‌) : తెలంగాణలో 2022 నాటికి ప్లాస్టిక్‌ను నిషేధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు.  ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవనంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల జాతీయ సదస్సుకు రాష్ట్రం నుంచి మంత్రి జోగు రామన్న హాజరయ్యారు. రెండో రోజు జరిగిన సదస్సులో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రి హర్షవర్ధన్, వివిధ రాష్ట్రాల అటవీశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. మంగళవారం సదస్సు అనంతరం తెలంగాణ భ వన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో మీడి యా సమావేశం నిర్వహించి సదస్సు వివరాలను మంత్రి రామన్న వెల్లడించారు.

దేశ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ను నిషేధించే విషయమై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ నేతృత్వంలో చర్చ జరిగిం దని తెలిపారు. తెలంగాణలో ఇప్పటికే 15 మైక్రాన్‌ల కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించామని, త్వరలో 50 మైక్రాన్ల కన్నా తక్కువగా ఉన్న వాటిని నిషేధించాలని భావిస్తున్నామని తెలిపా రు. వాతావరణ కాలుష్యం వల్ల రానున్న రోజుల్లో మానవ మనుగడకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అమలు చేస్తున్న కార్యక్రమాలను రెండు రోజుల పాటు సదస్సులో వివరించామని చెప్పారు. తెలంగాణలో తడి, పొడి చెత్తలను సేకరించేందుకు రెండు బుట్టలను అందజేశామని త్వ రలో ఒక్కసారి వినియోగించే ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించేందుకు నల్లరంగు ఉన్న డబ్బాలను ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

రాష్ట్రంలోని 73 మున్సిపాలిటీల నుంచి రోజుకు వచ్చే 7,270 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాల నుంచి 7,053 టన్నుల చెత్తను శుద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన కాంపా నిధుల్లో పది శాతం కూడా విడుదల చేయడం లేదన్నారు. ఆ నిధులు విడుదల చేస్తే తెలంగాణ వ్యాప్తంగా అడువుల పెంపకాన్ని వేగవంతం చేస్తామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. కాగా మొదటి రోజు సోమవారం రాజ్‌పథ్‌లో ఏర్పాటు చేసిన సింగరేణి స్టాల్‌ను మంత్రి జోగు రామన్న, ప్రిన్సిపల్‌ సెక్రటరీలు అజయ్‌ మిశ్రా సందర్శించారు. స్టాల్లో ఏర్పాటు చేసిన మ్యాన్‌రైడింగ్‌ సిస్టమ్‌ మోడల్, వివిధ పరికరాలను పరిశీలించారు. సదస్సులో మంత్రితో పాటు తెలంగాణ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ జి.అశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top