మూడో రోజూ అదే తీరు | peoples are concern on asara scheme | Sakshi
Sakshi News home page

మూడో రోజూ అదే తీరు

Dec 13 2014 3:20 AM | Updated on Aug 20 2018 6:02 PM

‘ఆసరా’ ఆందోళనలు శుక్రవా రం మూడోరోజూ కొనసాగాయి.

ప్రగతినగర్: ‘ఆసరా’ ఆందోళనలు శుక్రవా రం మూడోరోజూ కొనసాగాయి. నిజామాబాద్ అర్బన్‌లో ఈ పథకం మరీ ఘోరంగా విఫలమైంది. మున్సిప ల్ అధికారుల తీరుతో వేలాది మంది అర్హులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పింఛన్ రాలేదనే బెంగతో ఇద్దరు పండుటాకులు కన్నుమూశారు. నిజామాబాద్ నగరం కసాబ్‌గల్లీలో నివసించే రాజ్‌నారాయణ (70), కోటగిరి మండలం చిక్కడ్‌పల్లి గ్రామానికి చెందిన జింక పెద్ద సాయిలు (68) పింఛన్ కోసం తిరిగి తిరిగి అసువులుబాశారు. నిజామాబాద్ మండలంలో కొత్తగా వచ్చే పింఛన్లలో తమకూ స్థానం కల్పిస్తారేమోననే ఆశతో చాలా మంది వృద్ధులు వానలో తడుస్తూ గ్రామపంచాయతీల వద్ద పడిగాపులు గాశారు. మూడో రోజు వరకు జిల్లావ్యాప్తంగా 1,23,691 మందికి రూ. 26.02 కోట్లు పంపిణీ చేశారు.

నగరంలో అరకొరే!
నిజామాబాద్ నగరంలో ఆసరా పథకం కొందరికి శాపంగా మారింది. గతంలో 27 వేలకుపైగా పింఛన్లు పంపిణీ చేసేవారు. ఆసరా పథకం ప్రారంభం రోజున అర్బన్‌లో అసలు పింఛన్‌కు సంబంధించిన కార్యాలయాలుగాని, సిబ్బందిగానీ కనిపించలేదు. రెండో రోజు గురువారం కేవలం 153 పింఛన్లు మాత్రమే అందించారు. మూడో రోజు శుక్రవారం మున్సిపాలిటీ అధికారులు నరకాన్ని చూపించారు. జాబితాను దగ్గర పెట్టుకొని మొక్కుబడిగా పదులసంఖ్యలో మాత్రమే పింఛన్లు పంపిణీ చేశారు.

ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ రొనాల్డ్ రోస్ న్యూఎన్ జీఓస్ కాలనీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అక్కడ 52 మందిలో ఇద్దరికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేసి నట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశా రు. వెంటనే ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయరును పిలిపించి, అన్ని మం డలాలలో, మున్సిపాలిటీలలో పింఛన్ పంపిణీ సాఫీగా జరుగుతుంటే నగరంలో మాత్రం విఫలమయ్యారంటూ మండిపడ్డారు. అర్హులైన ఏ ఒక్కరికీ పింఛన్ మంజూరులో జాప్యం జరగకుండా చూడాలని ఆదేశించారు.అనం తరం పలు కేంద్రాలలో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement