పరిశుభ్రతపై అవగాహన ఉండాలి

People Should Be Aware Of Hygiene - Sakshi

డీఆర్‌డీఓ జగత్‌కుమార్‌ రెడ్డి

చుంచుపల్లి ఖమ్మం : గ్రామాలన్నింటినీ పారిశుద్ధ్యం వైపు నడిపించేందుకు పరిశుభ్రతపై అవగాహన అవసరమని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి పి.జగత్‌కుమార్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం డీఆర్‌డీఓ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడిలో పిల్లల ద్వారా పారిశుద్ధ్యాన్ని అమలు చేయించి, వారి ద్వారా గ్రామంలో అవగాహన పెంపొందించాలని పిలుపునిచ్చారు.

జిల్లా విద్యాశాఖాధికారిణి డి.వాసంతి మాట్లాడుతూ స్వచ్ఛ్‌భారత్‌ మిషన్‌ అమలులో ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా ఉండాలని కోరారు. అనంతరం సర్వేక్షణ్‌ గ్రామీణ్‌–2018 యాప్‌ గురించి, ఆన్‌లైన్‌ ఓటింగ్‌ గురించి వివరించారు. ప్రధానోపాధ్యాయులకు పంపిణీ చేసిన కిట్‌లలో జూట్‌ బ్యాగు, బకెట్, మగ్, టాయిలెట్‌ క్లీన్‌ బ్రష్, డెటాల్‌ సబ్బు, సేల్‌ కట్టర్, డిటర్జెంట్‌ పౌడర్, బ్లీచింగ్‌ పౌడర్, సున్నం ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అదనపు ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎస్‌.విజయచంద్ర, ఎస్‌బీఎం కన్సల్టెంట్స్‌ రేవతి, ఖాదర్‌పాషా, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top