పాతవి చెల్లిస్తేనే కొత్తవి.. | Pay Old loans and get new loans said bankers | Sakshi
Sakshi News home page

పాతవి చెల్లిస్తేనే కొత్తవి..

Jul 6 2014 11:38 PM | Updated on Oct 1 2018 2:03 PM

ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు గడుస్తున్నా.. రుణమాఫీ హామీపై ఎటూ తేలకపోవడంతో సంకట పరిస్థితి ఏర్పడింది.

పరిగి: ప్రభుత్వం కొలువుదీరి నెలరోజులు గడుస్తున్నా.. రుణమాఫీ హామీపై ఎటూ తేలకపోవడంతో సంకట పరిస్థితి ఏర్పడింది. పాత రుణాలు చెల్లించండి.. లేదంటే రెన్యూవల్ చేసుకోండి.. అప్పుడే కొత్త రుణాలిస్తాం.. అంటూ బ్యాంకు అధికారులు రైతులకు తెగేసి చెబుతున్నారు. అటు ప్రభుత్వం స్పందించకపోవటం, ఇటు అప్పులిచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అంటుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

 నియోజకవర్గంలో 60వేల పైచిలుకు రైతులు ఉండగా ఇప్పటికే ఆయా బ్యాంకుల ద్వారా రూ.350 కోట్ల రుణం పొంది ఉన్నారు. ఒక్క పరిగి (ఏడీబీ) ఎస్‌బీహెచ్‌లోనే రూ.90 కోట్ల దాకా రుణాలు తీసుకున్నారు. వీరంతా రుణమాఫీ ఎప్పుడవుతుందా.. కొత్త రుణాలు ఎప్పుడిస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.

 నడ్డి విరుస్తున్న ‘ప్రైవేటు’ వడ్డీ..
 ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావటంతో పెట్టుబడుల కోసం రైతులు నానా పాట్లు పడుతున్నారు. బ్యాంకర్లు రుణాల్వికపోవడంతో గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారును ఆశ్రయిస్తున్నారు. సాధారణ వడ్డీ వ్యాపారులు రూ.3 నుంచి రూ.5 వరకూ వడ్డీ వసూలు చేస్తుండగా, అడ్తీదారులు, ధాన్యం మిల్లర్లు, ఇతర ప్రైవేటు వ్యాపారులు షరతులు పెడు తూ అప్పులిస్తున్నారు. పండించే పంట లు తమకే అమ్మాలంటూ రూ.2 నుంచి రూ.3 వడ్డీ చొప్పున వసూలు చేస్తున్నా రు. రైతులు చేసేది లేక వడ్డీ ఎంతైనా.. షరతులేవైనా అంగీకరిస్తున్నారు.  

 అన్నీ సమస్యలే..
 సమస్యలన్నీ ఒక్కసారిగా రైతులను చుట్టుముట్టాయి. అటు బ్యాంకర్లు కనికరించకపోవటం, ఇటు పిల్లల చదువులు, ఎరువులు, విత్తనాలకు ఇప్పుడే ఖర్చు చేయాల్సి రావటం వారిని కుంగదీస్తోంది. కొందరు అప్పు చేసి ఇప్పటికే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకువెళ్లగా అటు వరుణుడు సైతం కరుణించటంలేదు. దీంతో ‘మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా’ మారింది వారి పరిస్థితి. 

Advertisement
 
Advertisement
Advertisement