చికిత్స చేయమంటే ప్రాణం తీశారు


రామకృష్ణాపూర్(ఆదిలాబాద్) : ‘జ్వరం ఎక్కువ ఉంది.. పేషెంట్ పరిస్థితి బాగోలేదు.. బయట ప్రైవేట్ ఆస్పత్రికైనా తీసుకెళ్తామన్నాం.. అయినా వైద్యులు పట్టించుకోకపోవడంతో మా కేశవులు మరణించాడు.. చికిత్స కోసం వస్తే కాటికి పంపారు’.. అంటూ మృతుని బంధువులు మంగళవారం స్థానిక సింగరేణి ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళన కు దిగారు. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీరాంపూర్ ఏరియా ఎస్‌ఆర్‌పీ-1 గనిలో కోల్‌ఫిల్లర్‌గా పనిచేస్తున్న కోరితె కేశవులు(54) జ్వరంతో బాధపడుతూ సోమవారం రామకృష్ణాపూర్‌లోని ఏరియా ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం ఉదయం కేశవులుకు జ్వరం తీవ్రంగా పెరగడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. బయట ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తామని వైద్యులను సంప్రదిం చారు. ప్రైవేట్ అంబులెన్స్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నారు.

 

 అయినా వైద్యులు ససేమిరా అన్నారు. ముక్కులో పైపు పెడుతుండగా కేశవులు వద్దంటూ కేకలు పెట్టినా పట్టించుకోలేదు. రక్తం కారుతున్నా వైద్య సిబ్బంది బలవంతంగా పైపులు పెట్టారని, కొద్ది సేపటికే కేశవులు మృతి చెందాడని కుటుంబ సభ్యులు విలపిస్తూ చెప్పారు. వైద్యుల నిర్లక్ష్య మే బలితీసుకుందని ఏరియా ఆస్పత్రి గేట్ వద్ద ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ప్లేట్‌లెట్ కౌంట్ తగ్గిపోవడం, జ్వరతీవ్రత ఎక్కువగా ఉండటం కేశవులు మృతికి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. కేశవులుకు భార్య, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు.

 

 నిర్లక్ష్యమే కారణం : కార్మిక నాయకులు

 విషయం తెలియగానే ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, టీబీజీకేఎస్ శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షుడు బండి రమేష్, మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపెల్లి సంపత్ తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేశవులు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. వైద్య పరీక్షలు నిర్వహించకుండా కాలయాపన చేయటం వల్లే కార్మికుడు మృతిచెందాడని అన్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు మృతుని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డి మాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top