దొడ్డిదారిలో ఆర్డినెన్స్‌ తెచ్చారు  | Sakshi
Sakshi News home page

దొడ్డిదారిలో ఆర్డినెన్స్‌ తెచ్చారు 

Published Mon, Dec 31 2018 2:29 AM

Panchayat elections may hit BC reservation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గిస్తూ దొడ్డిదారిన ఆర్డినెన్స్‌ తెచ్చారని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఆరోపించారు. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్‌ యాక్ట్‌లో తప్పులున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్‌ ఎలా తగ్గించారో చెప్పాలంటూ 2018 జూన్‌లో సీఎం కు లేఖ రాశామని, స్పందన లేకపోవడంతో హైకోర్టులో పిటిషన్‌ వేయడం జరిగిందని స్పష్టం చేశారు. పిటిషన్‌లో ఎక్కడా కూడా ఎన్నికలు ఆపమని కోరలేదని, ఎన్నికలు ఆపాలని కుట్ర చేసింది టీఆర్‌ఎస్సే అని దుయ్యబట్టారు. ఆదివారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పిటిషన్‌ వేసి ఎన్నికలు ఆపిందని సీఎం పేర్కొనడం పచ్చి అబద్ధమన్నారు. తాను ఎన్నికలు ఆపమని కోరి నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ నేతలను ఇడియట్స్‌ అంటూ కేసీఆర్‌ చేసిన వ్యా ఖ్యలను తీవ్రంగా ఖండించా రు. సీఎం తన స్థాయిని తగ్గించుకుని అహంకారంతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కోర్టు తీర్పు ఇచ్చినా కుల గణన చేయకుండా మోసం చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ గోపాల్‌రెడ్డి పిటిషన్‌ వేస్తే 50 శాతం రిజర్వేషన్‌ ఇవ్వొద్దని కోర్టు చెప్పిందని శ్రవణ్‌ అన్నారు. అతన్ని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్‌ చేయలేదని ప్రశ్నించారు.  2009లో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ కేటగిరి చేసి రిజర్వేషన్‌ అమలు చేయాలని టీఆర్‌ఎస్‌ కోర్టులో పిటిషన్‌ వేయలేదా అని ప్రశ్నించారు. అది తప్పు కానప్పుడు తాము కోరితే తప్పు ఎలా అవుతుందన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కడుతున్న కేసీఆర్‌కు బీసీగణన చేయడం పెద్ద సమస్య కాదని, చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు. కర్ణాటకలో మాదిరిగా బీసీ వర్గీకరణ ప్రకారం రిజర్వేషన్‌ అమలు చేయాలన్నారు.   

Advertisement
Advertisement