త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహిస్తాం | Single member commission report on BC reservations soon | Sakshi
Sakshi News home page

త్వరలో ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహిస్తాం

Jun 19 2026 4:41 AM | Updated on Jun 19 2026 4:41 AM

Single member commission report on BC reservations soon

బీసీ రిజర్వేషన్లపై త్వరలో ఏకసభ్య కమిషన్‌ నివేదిక  

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని.. త్వరలో వాటిని నిర్వహిస్తానని రాష్ట్ర ప్రభుత్వం గురువారం హైకోర్టుకి నివేదించింది. సమగ్ర కుటుంబ సర్వే పూర్తయిందని, దానికి సంబంధించిన డేటాను ఈనెల 19 నుంచి రెండ్రోజుల పాటు గ్రామసభల ముందు ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ తెలిపారు. ఆ తరువాత ఈనెల 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అలాగే, స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌ ఖరారు నిమిత్తం ఏర్పాటుచేసిన ఏకసభ్య కమిషన్‌ త్వరలో నివేదిక ఇస్తుందని ఆయన చెప్పారు. 

కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లను ఖరారుచేసి ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న న్యాయస్థానం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయా­లని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 16కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది.  

ఏపీ బీసీ సంఘం పిల్‌ దాఖలు.. 
బీసీ జన గణన చేపట్టకుండా స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, బీసీ జనాభా లెక్కించిన తరువాతే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు కేశన శంకర రావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. స్థానిక సంస్థల కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్‌ మరో పిల్‌ వేయడంతో ఈ రెండు వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement