ఒకే స్థలం రెండు సంస్థలకు!

One Land For Two Companies - Sakshi

మంథనిలో రూ.కోటి స్కాం

ప్రభుత్వానికి అమ్మిన భూమిని ప్రయివేటు సంస్థకు రిజిస్ట్రేషన్‌ చేసిన పట్టాదారు

కలెక్టర్‌ సమీక్షలో వెలుగులోకి..

స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌కు ఆదేశం

అక్రమంగా పట్టాచేసినవారిపై చర్యలకు సిఫారసు

సాక్షి, మంథని : ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా ఓ పట్టాదారు వద్ద కొనుగోలు చేసిన భూమిని సదరు పట్టాదారు మరలా ఓ ప్రైవేటు సంస్థకు రిజిస్ట్రేషన్‌ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగుచూసింది. మంథని డివిజన్‌లో నెలకొన్న రెవెన్యూ సమస్యలపై కలెక్టర్‌ శ్రీ దేవసేన మండలపరిషత్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా ఇన్‌చార్జి డీఆర్వో పద్మయ్య, డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. మంథని మండలం నాగారం శివారులోని సర్వే నంబర్లు 95, 97లోని 17 ఎకరాల భూమిని 1997లో ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొనుగోలు చేసింది. దానిని 17 మంది ఎస్సీలకు పంపిణీ చేసిందని గ్రామానికి చెందిన రైతు బెల్లంకొండ రవీందర్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాడు.

అప్పటి నుంచి కాస్తులో ఉన్న ఎస్సీలు తమ పేర్లను పహణీలో చేర్చాలని, పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని అధికారుల చుట్టు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఇదే అదునుగా పట్టాదారు అదే భూమిని ఓ ప్రైవేటు సంస్థకు ఎకరాకు రూ.9 లక్షల చొప్పున 11 ఎకరాలను 2015–16లో అమ్మినట్లు తెలిపారు. సమస్యపై తీవ్రంగా స్పందించిన కలెక్టర్‌ తహసీల్దార్‌ సుధాకర్‌ను వివరణ కోరారు. రెండోసారి అక్రమ పట్టా నిజమేనని చెప్పడంతో వెంటనే సదరు భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డుల్లో  చూపని కారణమా లేక మరేదో చూడాలని, రిజిస్ట్రేషన్‌ అథారిటీ, రెవెన్యూ అథారిటీ వేరని, ప్రభుత్వం కొత్తగా రెవెన్యూకే రిజిస్ట్రేషన్‌ అథారిటీ అప్పగించినందున ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో తలెత్తకపోవచ్చని తెలిపారు. నాగారంలో జరిగిన సమస్యను తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. అక్రమంగా రెండోసారి పట్టా చేసి వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు వేయాలని ఆదేశించారు. అ భూమిలో ఇప్పటికే పట్టాలు ఇచ్చి ఉంటే వారిలో అర్హులను గుర్తించి పాస్‌పుస్తకాలు జారీ చేయాలని సూచించారు.  

నెలాఖరులోగా అందరికీ పాస్‌పుస్తకాలు..
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా రైతులందరికీ  పట్టాపాస్‌పుస్తకాలు జారీ చేస్తామని కలెక్టర్‌ తెలిపాçరు. రైతులకు పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ నిరంతరం జరుగుతుందని, ఎవరూ హైరానా పడాల్సిన అవరం లేదన్నారు. జిల్లాలో 1.26 లక్షల మంది రైతులను గుర్తించామని, 1.13 లక్షల పాస్‌పుస్తకాలు ప్రింట్‌ చేయించామన్నారు. ఇప్పటి వరకు 1.09 లక్షల మంందికి పంపిణీ చేశామని వివరించారు. వివిధ కారణాలతో 12 వేల పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయలేదన్నారు. పంపి ణీ చేసిన పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పుల సవరణ, కొత్త పాస్‌పుస్తకాల పంపిణీ పక్రియ ను నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్నారు. ఇలాంటివి జిల్లాలో 3 వేలు ఉన్నాయని తెలి పారు. గతంలో ఉన్న వెబ్‌లాండ్‌తో అనేక సమస్యలు వచ్చాయని ధరణీ వెబ్‌సైట్‌ పకడ్బందీగా ఉందన్నారు. కొత్తగా చేర్చిన సమాచారం ఆన్‌లైన్‌లో నమో దు చేసి సెంట్రలైజ్డ్‌ ప్రింటింగ్‌ ద్వారా రైతులకు అందిస్తాన్నారు.

భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా పార్ట్‌–ఏ, బీ నమోదు చేశామని పార్ట్‌–ఏ కింద 94 శాతం పూర్తి చేసామని బీలో కేవలం 6 శాతమే అన్నారు. వివాదాలు, ఫిర్యాదుల ఉన్నవాటిని బీలో చేర్చామని, పరిశీలన, విచారణ అనంతరం అర్హులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. నాగారంలో గ్రామం రెవెన్యూ, గ్రామపంచాయతీలో లేకుండా పోవడంతో ఇబ్బందులు ఎదురొంటున్నామని ప్రకాశ్‌రెడ్డి కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. రామగుండం కార్పొరేషన్‌కు 25 కిలోమీటర్ల దూరంలో గ్రామం ఉండడంతో నిబంధన అడ్డుగా ఉందని తెలిపారు. రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలో కాస్తులో ఉన్న భూమి అటవీశాఖవారు తమదని అంటున్నారని గ్రామస్తులు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. సాదాబైనామాలు చాలా కాలంగా పెండింగ్‌ ఉన్నాయ ని డిసెంబర్‌ 31 వరకు మాత్రమే దరఖాస్తులు తీసుకున్నారని.. తర్వాత తీసుకోవాలని పలువురు కోరారు.

అలాగే పీఓటీ కింద వేల సమస్యలు గుర్తించా మని, వీటన్నింటిపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ రైతుల నుంచి వచ్చిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీంచి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గ్రామాల్లో తిరుగుతుంటే రెవెన్యూ సమస్యలే ఎక్కువగా వస్తున్నాయని అందుకే  ప్రత్యక సమావేశం ఏర్పాటు చేయించా మన్నారు. అధికారులు మానవీయ కోణాన్ని చూడాలని, వారి పరిధిలో ఉన్న వాటిని పరిష్కరించి ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. మంథన, ముత్తారం ఎంపీపీలు ఏగోళపు కమల, అత్తె చంద్రమౌళి, కమాన్‌పూర్‌ జెడ్పీటీసీ, మంథని సర్పంచ్‌ పుట్ట శైలజ, ఆయా మండలాల తహసీల్దార్లు సమావేశంలో పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top