‘సంపూర్ణ భోజనం’ | Sakshi
Sakshi News home page

‘సంపూర్ణ భోజనం’

Published Fri, Dec 12 2014 12:02 AM

One full-Meal scheme in anganwadi centers

అంగన్‌వాడీల్లో కొత్త పథకం ‘వన్ ఫుల్ మీల్’

తాండూరు: మాతా, శిశు మరణాలను తగ్గించాలనే ఆలోచనతో తెలంగాణ సర్కారు ‘వన్ ఫుల్ మీల్ (ఒక పూట సంపూర్ణ భోజనం) పథకాన్ని తీసుకురానున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇందిరమ్మ అమృత హస్తం పథకంలో పలు మార్పులు చేసి ‘వన్ ఫుల్ మీల్’ను రూపొందించారు. గతంలో ఈ పథకం పరిమితంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో అమలు చేయ గా తెలంగాణ ప్రభుత్వం విస్తృత పరు స్తూ అన్ని కేంద్రాలకు వర్తింపచేయడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా ఈ పథ కం ఈనెల 15న ప్రారంభం కానుంది.

ఈ ఏడాది నవంబర్ 26న ఈ పథకానికి సంబంధించి జీఓ నం.12 జారీ చేశారు. అమృతహస్తం పథకాన్ని జిల్లాలో పరిగి, తాండూరు, వికారాబాద్, మర్పల్లి, మహేశ్వరం ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో అమలు చేశారు. కొత్త పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఉన్న మొత్తం 13 ఐసీడీఎస్ ప్రాజెక్టులను ఎంపిక చేశారు. మెనూలోనూ మార్పు లు చేశారు. ఆయా ప్రాజెక్టుల పరిధిలోని 2,524 ప్రధాన అంగన్‌వాడీలు, 269 మినీ అంగన్‌వాడీల ద్వారా సుమారు 1.95లక్షల మంది ఏడు నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలతోపాటు సుమారు 52వేల మంది గర్భిణులు, బాలింతలకు ఒక పూట భోజనం, ప్రతి రోజూ పాలు, గుడ్లు, ఆకుకూరలు, సాంబారు తదితరాలతో పోషకాలున్న భోజనం అందజేస్తారు.

గతంలో బాలింతులు,గర్భిణునలకు  నెలలో 25 రోజులు మాత్రమే 200 మిల్లీలీటర్ల పాలు, ఒక గుడ్డు అందించేవారు. తాజాగా వన్‌ఫుల్ మీల్ కింద 30 రోజులుపాలు, గుడ్డు అందిస్తారు. ఆదివారం సెలవు అయినందున ఆ రోజు ఇచ్చే పాలు, గుడ్లను సోమ, మంగళవారాల్లో ఎగ్ కర్రీ, పెరుగు రూపంలో బాలింతలు, గర్భిణులకు అందించేలా మెనూ తయారు చేశారు. గతంలో ఏడు నెలల నుంచి మూడేళ్ల పిల్లలకు నెలకు ఎనిమిది గుడ్లను ఇచ్చేవారు. ఇప్పుడు ప్రతి రోజూ గుడ్డు ఇవ్వనున్నారు.

పిల్లలకు పది రోజులకు పది గుడ్ల చొప్పున మూడు విడతల్లో అందజేస్తారు. ఇక మూడేళ్ల నుంచి ఆరు ఏళ్ల చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల్లో వారానికి నాలుగు గుడ్లను ఇచ్చేవారు. ఇక నుంచి ప్రతి రోజూ పిల్లలకు గుడ్లు ఇస్తారు. ఆదివారం సెలవు దినం కావడం వల్ల ఆ రోజు ఇవ్వాల్సిన గుడ్డును పిల్లలకు ముందు రోజే.. అంటే శనివారం అందజేస్తారు. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు (నాలుగు నెలలకు) గుడ్లు, పాల కోసం రూ.94,82,95,872 కేటాయించారు.

సోమవారం నుంచి వన్‌ఫుల్ మీల్ - సీడీపీఓ వెంకటలక్ష్మి
అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం నుంచి పథకం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పథకం అమలుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం.

Advertisement
Advertisement