మొక్కు‘బడులు’ | no students coming for summer studies under the rajiv vidya mission | Sakshi
Sakshi News home page

మొక్కు‘బడులు’

May 28 2014 1:34 AM | Updated on Sep 2 2017 7:56 AM

రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ప్రారంభించిన వేసవి బడులు నామమాత్రం గా కొనసాగుతున్నాయి.

 నిజాంసాగర్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి ప్రారంభించిన వేసవి బడులు నామమాత్రం గా కొనసాగుతున్నాయి. చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం వేసవి బడులను తెరచినా ఆదరణ కరువైంది. ప్రాథమిక స్థాయిలో అక్షరాభ్యాసానికి దూరమతున్న విద్యార్థుల్లో నెపుణ్యతను పెంపొందించడంతో పాటు వారిని ముందుకు తీసుకురావడానికి చేపట్టిన ప్రణాళిక నీరుగారుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్న వేసవి బడుల్లో వెనుకబడిన విద్యార్థులు కనిపించడం లేదు.

 జిల్లాలో..
 జిల్లావ్యాప్తంగా 229 క్లస్టర్లకు గాను ప్రస్తుతం 228 క్లస్టర్లలో వే సవి బడులను ఆర్వీఎం సహకారంతో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలోని 1, 2, 3, 4, 5 తరగతుల్లో వెనుకబడిన (సీ గ్రేడ్) విద్యార్థులను క్లస్టర్ల వారీగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించారు. వేసవి సెలవుల్లో వీరు అభ్యసనకు దూరం కాకుండా  ఉండేందుకు ఆటపాటల ద్వారా చదువు నేర్పించేందుకు వేసవి బడులను ప్రారంభించారు. అభ్యసన పుస్తకాలను ఆర్వీఎం అధికారులు మండలాల వారీగా పాఠశాలలకు పంపిణీ చేశారు.

 ఒక్కో వేసవి బడిలో 30 మంది విద్యార్థుల చొప్పున గుర్తించారు. వేసవి బడుల నిర్వహణ కోసం ఆయా క్లస్టర్ల వారీగా ఉన్న సీఆర్పీలు బడులను నిర్వహిస్తున్నారు. బడులు ప్రారంభమైన వారం రోజుల పాటు సీ గ్రేడ్ విద్యార్థులు ఆసక్తి చూపారు. కాని గడిచిన వారం రోజుల నుంచి కొన్ని బడులకు విద్యార్థులు రావడం లేదు. ఆయా క్లస్టర్ల వారీగా కొనసాగుతున్న వేసవి బడుల నిర్వహణపై ఆర్వీఎం అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సీఆర్పీలు మొక్కుబడిగా వాటి ని నిర్వహిస్తున్నారు.

 ఏ గ్రేడ్ విద్యార్థులు హాజరు
 వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రారంభించిన వేసవి బడుల్లో ఏ గ్రేడ్ విద్యార్థులు ఉం టున్నారు. సోమవారం మహమ్మద్‌నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని వేసవి బడిలో పలువురు ఏ గ్రేడ్ విద్యార్థులు కనిపించారు. ఇక్కడ తొమ్మిది మంది సీ గ్రేడ్ విద్యార్థులుండగా.. వారు వేసవి బడికి రాకుండా వీధుల్లో ఆడుకోవడానికే ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement