‘రైతుబంధు’కు కొత్త బ్యాంకు ఖాతాలు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడి వదులుకునే వారి నగదు, రాష్ట్ర రైతు సమన్వయ సమితికి విదేశాల నుంచి అందే నిధులు, కొన్ని రకాల చెక్కుల సొమ్ము తక్కువ లేదా ఎక్కువ ఉండటం వంటి వాటి జమ కోసం వ్యవసాయ శాఖ కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిచింది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఎం.జగన్మోహన్ బుధవారం నిర్దేశిత ఎనిమిది బ్యాంకుల్లో ఈ ఖాతాలు తెరిచారు. గివ్ ఇట్ అప్ కింద దాదాపు రూ.30 లక్షలకు పైగా విలువైన చెక్కులను వ్యవసాయ శాఖకు కొందరు అందజేశారు.
ఆ సొమ్మును ఎక్కడ జమ చేయాలో తెలియక అలాగే ఉంచారు. ఇక రైతు సమన్వయ సమితి చేసే కార్యక్రమాలకు నిధులు ఇస్తామని విదేశాల్లో ఉండే అనేకమంది తెలంగాణ వాసులు ముందుకు వస్తున్నారు. అటువంటి చెక్కుల సొమ్ము జమ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖాతాలు తెరిచినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్రం లో ఇప్పటివరకు 9,085 గ్రామాల్లో చెక్కుల పంపిణీ పూర్తయినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. కాగా, పట్టాదారు పాసు పుస్తకం పొందని రైతుల చెక్కులను తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం తీసుకొస్తే క్లియర్ చేయాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.