నల్లా ‘సౌ’లత్‌..  | Nalla Connections With Mission Bhagiratha Khammam | Sakshi
Sakshi News home page

నల్లా ‘సౌ’లత్‌.. 

Feb 16 2019 7:41 AM | Updated on Feb 16 2019 7:41 AM

Nalla Connections With Mission Bhagiratha Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: నల్లా కనెక్షన్‌ డిపాజిట్లు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూరనున్నది. మిషన్‌ భగీరథ పథకం ద్వారా పట్టణాలు, నగరాలకు స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పంపు కనెక్షన్‌ డిపాజిట్లను రూ.100కు తగ్గించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులను ప్రభుత్వం రేపో.. మాపో జారీ చేయనుంది.

ఇప్పటివరకు జిల్లాలోని ఖమ్మంతోపాటు మధిర, వైరా, సత్తుపల్లి ప్రాంతాల్లో ఉన్న నివాసాలన్నింట్లో.. 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలోని అన్ని నివాస ప్రాంతాల్లో పంపు కనెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు సెక్యూరిటీ డిపాజిట్‌ ఎక్కువగా ఉండడంతో ఇంటి యజమానులు ముందుకు రాలేదు. ప్రస్తుతం డిపాజిట్లు తగ్గించడంతో నూటికి నూరు శాతం మంది పంపు కనెక్షన్లు తీసుకునే అవకాశం ఉంది. అక్రమ కనెక్షన్లను సైతం సక్రమంగా మార్చుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.

జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ద్వారా పంపు కనెక్షన్లు తీసుకోవాలంటే డిపాజిట్‌గా చెల్లించే సొమ్ము ఎక్కువగా ఉంటోంది. అయితే ప్రజలందరికీ సురక్షితమైన, మంచినీటిని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం పంపు కనెక్షన్లకు ఉన్న డిపాజిట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి పంపు కనెక్షన్‌ కావాలంటే రూపాయి డిపాజిట్‌గా చెల్లిస్తే సరిపోయేది. ఇతరులు పంపు కనెక్షన్‌ తీసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నెలకు రూ.110 చెల్లించాలి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పంపు కనెక్షన్‌ కావాల్సిన వారు సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇక పంపు బిల్లు ప్రతినెలా రూ.110 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.

ఖమ్మం కార్పొరేషన్‌లో.. 
నగరంలో సుమారు 4 లక్షల వరకు జనాభా ఉన్నారు.. మొన్నటి వరకు మున్సిపాలిటీగా ఉన్న పట్టణం తొమ్మిది విలీన గ్రామాలతో కార్పొరేషన్‌గా అవతరించింది. నగర పరిధిలో 63,304 గృహాలు ఉన్నట్లు మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు. ఇందులో 31,500 మాత్రమే పంపు కనెక్షన్లు ఉన్నాయి. కేవలం 50 శాతం మంది మాత్రమే పంపు కనెక్షన్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం డిపాజిట్‌ను రూ.100కు తగ్గించడంతో మధ్య తరగతి వర్గాలకు ఊరట లభించనున్నది. కేవలం నెలవారీ పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. కార్పొరేషన్‌లో ఇప్పటివరకు 217 పంపు కనెక్షన్ల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. డిపాజిట్‌ తగ్గడంతో వాటిని పరిష్కరించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
 
మున్సిపాలిటీల్లోనూ పెరగనున్న కనెక్షన్లు.. 
జిల్లాలోని వైరా, సత్తుపల్లి, మధిర మున్సిపాలిటీల్లో కూడా అనేక గృహాలకు పంపు కనెక్షన్లు లేవు. సెక్యూరిటీ డిపాజిట్‌ ఎక్కువగా ఉందనే కారణంతో అనేక మంది పంపు కనెక్షన్లు పెట్టించుకోలేదు. ప్రస్తుతం సెక్యూరిటీ డిపాజిట్‌ రూ.100కు తగ్గించడంతో ఈ మున్సిపాలిటీల్లో కూడా పంపు కనెక్షన్లు పెరిగేందుకు ఆస్కారం ఉంది. మధిర మున్సిపాలిటీ పరిధిలో 9,048 గృహాలు ఉండగా.. 5,205 పంపు కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి.

రూపాయి డిపాజిట్‌ కింద ఇవ్వాల్సిన కనెక్షన్లు 2,688 పెండింగ్‌లో ఉన్నాయి. వైరాను ఇటీవలే మున్సిపాలిటీగా ప్రకటించారు. ఇక్కడ 6,355 గృహాలు ఉండగా.. 2,500 పంపు కనెక్షన్లు ఉన్నాయి. సత్తుపల్లి మున్సిపాలిటీలో 7,321 గృహాలు ఉండగా.. 5,316 నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో మిషన్‌ భగీరథ పైపులైన్ల పనులు కూడా పూర్తి కావొచ్చాయి. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే దరఖాస్తు చేసుకున్న వారికి పంపు కనెక్షన్లు ఇవ్వనున్నారు. 
  
ఆదేశాలు రాగానే.. 
పంపు కనెక్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే నగరంలో అమలు చేస్తాం. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికీ కనెక్షన్లు ఇస్తాం. నగరంలో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛమైన నీటిని పొందాలి. – జె.శ్రీనివాసరావు, కేఎంసీ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement