ప్లాస్మా దానం: ప్రభుత్వానికి ఒవైసీ లేఖ | Sakshi
Sakshi News home page

ప్లాస్మా దానం: ప్రభుత్వానికి ఒవైసీ లేఖ

Published Tue, Apr 28 2020 8:33 AM

MP Asaduddin Owaisi Letter To TS Government On Plasma Donate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తబ్లిగీ జమాత్‌లో పాల్గొని కరోనా సోకి, దాని నుంచి కోలుకున్న ముస్లిం సోదరులు కోవిడ్‌తో పోరాడుతున్న ఇతరులకు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. కరోనా సోకి అనంతరం కోలుకున్న ఢిల్లీకి చెందిన 300 మంది ముస్లింలు, ఇప్పటికీ కరోనాతో పోరాడుతున్న ఇతరులకు తమ ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ తెలంగాణ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. కరోనా వైరస్‌ సోకి కోలుకున్న 32 మందిని ప్లాస్మా దానం చేయాల్సిందిగా తాను స్వయంగా కోరినట్లు తెలిపారు. దానికి వారు సుముఖత వ్యక్తం చేశారని, వారి వివరాలను ప్రభుత్వానికి అందచేస్తున్నా అని ఒవైసీ పేర్కొన్నారు. (కరోనా: ‘ప్లాస్మా థెరపి’ అంటే ఏమిటీ?)

వైరస్‌ నుంచి కొలుకున్న 32 మంది వైరస్‌ బాధితుకుల ప్లాస్మా దానం చేస్తారని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి  ఈటల రాజేందర్‌కు లేఖ రాశారు. కాగా మార్చిలో జరిగిన తబ్లిగీ సదస్సు భారీ స్థాయిలో వ్యతిరేకతను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. తబ్లిగీలో పాల్గొన్న ముస్లింలు దేశద్రోహులంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా వెలిశాయి. ఈ నేపథ్యంలో  జమాత్‌ చీఫ్‌ మౌలానా సైతం ప్లాస్మా దాన కార్యక్రమానికి కరోనా నుంచి కోలుకున్న ముస్లింలు ముందుకు రావాలంటూ రంజాన్‌ సందర్భంగా పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. (ముస్లింలకు అసదుద్దీన్‌ విజ్ఞప్తి)

Advertisement
Advertisement