శివారు.. సిటీ.. ఓ ఎంఎంటీఎస్‌!

MMTS Phase 2 faster - Sakshi

శివారు ప్రాంతాలను అనుసంధానం చేసే ఎంఎంటీఎస్‌ ఫేజ్‌–2 వేగవంతం

ప్రారంభానికి సిద్ధంగా తెల్లాపూర్‌– రామచంద్రాపురం మార్గం

మొత్తం అంచనా వ్యయం రూ.817 కోట్లు

రాష్ట్ర వాటా రూ.544 కోట్లు, ద.మ.రైల్వే వాటా రూ.272 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు ప్రాంతాలను నగరంతో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులు శరవేగంగా సాగుతు న్నాయి. ఎంఎంటీఎస్‌ 2వ దశ మొత్తం 96.25 కి.మీల దూరంతో రూ.641 కోట్ల అంచనా వ్యయంతో 2012– 13లో ఈ పనులకు అనుమతులు వచ్చాయి. పెరిగిన అంచనా వ్యయం మేరకు రూ.817 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టాయి.

ఇందులో రాష్ట్రం రూ.544 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే రూ.272 కోట్లు భరించాలి. అయితే ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.110 కోట్లు మాత్రమే విడుదల చేయగా, దక్షిణ మధ్య రైల్వే తన వంతు నిధులను పూర్తిగా ఖర్చు చేసింది. మిగతా నిధులు కూడా విడుదలైతే ప్రాజెక్టును త్వరగా అందుబాటులోకి తీసుకువస్తా మని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.

ఈ పనులు పూర్తయితే తెల్లాపూర్‌–రామచంద్రాపురం, సనత్‌నగర్‌–మేడ్చల్‌–బొల్లారం, ఫలక్‌నుమా–ఉందానగర్‌  ప్రాంతాలు.. శంషాబాద్‌ విమానాశ్రయం, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లతో సులువుగా అనుసంధానం అవు తాయి. ఫలితంగా నగరవాసులకు భారీగా సమయం, ఇంధన ఆదా, ప్రయాణ ఖర్చులు కలసి వస్తాయి.  

పెరిగిన అంచనా వ్యయం....
ప్రారంభం నాటి అంచనా ప్రకారం ప్రాజెక్టు విలువ రూ.641 కోట్లు.. తరువాత భూసేకరణ, పనుల్లో జాప్యం తదితర సమస్యల కారణంగా రూ.817 కోట్లకు చేరింది. మిగతా మార్గాల్లో సమస్యలు కొలిక్కి రాగా, సనత్‌నగర్‌–మౌలాలి మార్గంలోని సుచిత్ర ప్రాంతంలో భూ సేకరణపై కాస్త ప్రతిష్టంభన నెలకొంది. దీనిపై ద.మ.రైల్వే, రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నాయి.  

ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి..
1. తెల్లాపూర్‌–రామచంద్రాపురం  
  2. సికింద్రాబాద్‌–బొల్లారం 

ఇంకా రావాల్సింది.. రూ.434 కోట్లు..
ఒప్పందం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్‌ 18 నాటికి పనులు పూర్తవ్వాలి. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వాటాలోని మిగిలిన రూ.434 కోట్లు కూడా విడుదలైతే త్వరలోనే రైళ్లు పట్టాలెక్కనున్నాయి.  

ఎంఎంటీఎస్‌ 2వ దశ మార్గాలివే...
1.ఫలక్‌నుమా–ఉందానగర్‌–శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు (13.5 కి.మీ.+6.5 కి.మీ.) డబ్లింగ్‌+ఎలక్ట్రిఫికేషన్‌ పనులు. అంచనా వ్యయం రూ.85 కోట్లు. (ఇందులో ఉందానగర్‌– ఎయిర్‌పోర్టు 6.5 కి.మీ.ల దూరంలో కొత్త రైల్వేలైను నిర్మాణ పనులకు ఇంకా అనుమతి రాలేదు.)
2.తెల్లాపూర్‌–రామచంద్రాపురం (5.75కి.మీ). పాత ట్రాక్‌ను పునరుద్ధరణ+విద్యుదీకరణ. అంచనా వ్యయం రూ.32 కోట్లు
3. సికింద్రాబాద్‌–బొల్లారం (14కి.మీ.).ఎలక్ట్రిఫికేషన్‌+స్టేషన్‌ ఆధునీకరణ.అంచనా వ్యయం రూ.30 కోట్లు
4.సనత్‌నగర్‌–మౌలాలి (22.4 కి.మీ.). డబ్లింగ్‌+ఎలక్ట్రిఫికేషన్‌. అంచనా వ్యయం రూ.170 కోట్లు
5. మౌలాలి–మల్కాజిగిరి–సీతాఫల్‌మండి (10 కి.మీ.). డబ్లింగ్‌+ఎలక్ట్రిఫికేషన్‌. అంచనా వ్యయం రూ.25 కోట్లు
6. బొల్లారం–మేడ్చల్‌ (14 కి.మీ.). డబ్లింగ్‌+ఎలక్ట్రిఫికేషన్‌. అంచనా వ్యయం రూ.74 కోట్లు.
7. మౌలాలి–ఘట్‌కేసర్‌ (12.2 కి.మీ.).నాలుగులైన్ల నిర్మాణం+ఎలక్ట్రిఫికేషన్‌.అంచనా వ్యయం రూ.120 కోట్లు
8. ప్రయాణికుల సదుపాయాలకురూ.20 కోట్లు
9. రైలు కోచ్‌లకు రూ.85 కోట్లు
మొత్తం వ్యయం... 641 కోట్లు

గడువులోగా పూర్తి చేస్తాం...
ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. ప్రభుత్వం కూడా మాకు పూర్తిగా సహకరిస్తోంది. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌తో సమావేశం నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిధులు కూడా విడుదల చేసింది. గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేస్తామన్న నమ్మకం ఉంది.  – వినోద్‌కుమార్‌ యాదవ్, జీఎం, ద.మ. రైల్వే  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top