మిర్చి రైతుకు దండగ.. వ్యాపారికి పండగ

Mirchi Farmers Facing Problems In Khammam - Sakshi

కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ సరుకుకు పెరుగుతున్న ధర

సాక్షి, ఖమ్మం: ఎండనక వాననక..రేయనక పగలనక..రెక్కలు ముక్కలు చేసుకొని రైతులు పండించిన పంటలు వ్యాపారులకు సిరులు కురిపిస్తున్నాయి. ఆరుగాలం శ్రమించిన కర్షకుడికి నష్టాలు మిగలగా..ఆ సరుకును కొనుగోలు చేసి నిల్వ పెట్టుకున్న వ్యాపారులకు అనతి కాలంలోనే లాభాలను కూడబెడుతున్నాయి. ఈ ఏడాది రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ పెట్టుకున్నవారికి లాభాల వాన కురుస్తోంది. పలు దేశాల్లో మిర్చికి డిమాండ్‌ పెరుగుతుండటంతో ఇక్కడ కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసిన సరుకుకు ధర పలుకుతోంది.

పంట డిమాండ్‌ ఉన్న దేశాలకు ప్రభుత్వం ఎగుమతులకు అవకాశాలు కల్పించడంతో వ్యాపారులకు బాగా కలిసి వచ్చింది. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కృష్ణ, గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా  క్వింటాల్‌  రూ.12 వేలకు పైమాటే సగటున రూ.4 వేల మేరకు లాభం 32 కోల్డ్‌ స్టోరేజీల్లో 15లక్షల క్వింటాళ్ల నిల్వలు సాగు చేసే పంటల్లో మిర్చి ఒకటి. చైనా, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాల్లో తేజ రకం మిర్చికి మంచి డిమాండ్‌ ఉంటుంది. జిల్లాలో జనవరి నుంచి ఏప్రిల్‌ నెల వరకు ఈ పంట ఉత్పత్తి సీజన్‌. అప్పుడే పంట విక్రయానికి వస్తుంది. ఖమ్మం పరిసర జిల్లాల్లో పండించిన తేజ రకం మిర్చిని రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు.

పంట సీజన్‌లో సగటున క్వింటా రూ.8,500 పలికింది. తొలికోత మిర్చికి రూ.7వేల నుంచి రూ.7,500 వరకు మాత్రమే ధర పలకగా, రెండో కోత మిర్చికి రూ.8 వేల నుంచి రూ. 9వేలకు మించి పడలేదు. ఇక మూడో కోత మిర్చికి రూ. 8 వేల వరకు మాత్రమే ధర పలికింది. అయితే..అప్పుడు రైతుల నుంచి పంటను వ్యాపారులు కొనుగోలు చేసి కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ పెట్టారు. ఇతర ఆదాయ వనరులు, పెట్టుబడులు ఉన్న రైతులు కొందరు నిల్వ పెట్టుకున్నారు. ఏసీ మిర్చికి క్వింటా ధర రూ. 12 వేలకు పైగానే పలుకుతోంది.

నిల్వ మిర్చికి భలే గిరాకీ
కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచిన తేజ రకం మిర్చి ధర క్రమక్రమంగా పెరుగుతోంది. సీజన్‌లో వ్యాపారులు పంట కొనుగోలు చేసిన 70 రోజుల వ్యవధిలో ధర అమాంతం పెరిగింది. జూన్‌ ఆరంభంలో క్వింటా ధర రూ.10 వేలు దాటి..ఇప్పుడు ఎగబాకింది. 20 రోజుల వ్యవధిలో ఏకంగా క్వింటాల్‌కు రూ. 2,300 పెరిగి రూ.12,300లకు చేరింది. ప్రస్తుతం నాణ్యతను బట్టి రూ. 12 వేల నుంచి రూ. 12,300 వరకు రేటు పడుతోంది. రైతు వద్ద కొనుగోలు చేసిన ధర కన్నా అదనంగా మరో రూ.4 వేలు మిర్చికి ధర పలుకుతోంది. అయితే కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ చేసుకున్నందుకు స్వల్పంగా ఖర్చులున్నా..భారీగా లాభాలు దక్కనున్నాయి.

పొరుగు దేశాల్లో డిమాండ్
 తేజ రకం మిర్చికి పొరుగు దేశాల్లో డిమాండ్‌ ఉంది. దీంతో ఇక్కడ పండించే ఈ రకం మిర్చికి ధర పెరుగుతోంది. చైనా, మలేషియా, సింగపూర్‌ తదితర దేశాలకు ఈ రకం మిర్చిని వివిధ రకాలుగా వ్యాపారులు ఎగుమతులు చేస్తున్నారు. ఆయిల్‌ రూపంలో కొందరు, తొడిమలు తీసి మరికొందరు వ్యాపారులు ఈ పంట ఉత్పత్తిని ఎగుమతులు చేస్తున్నారు. దీంతో పంట ఎగుమతుల వేగం తక్కువగా ఉంది. దీంతో ఆయా దేశాల్లో పంటకు డిమాండ్‌ పెరుగుతోంది.

32 కోల్డ్‌ స్టోరేజీల్లో లక్షల క్వింటాళ్ల నిల్వలు
జిల్లాలోని మొత్తం 32 కోల్డ్‌ స్టోరేజీల్లో దాదాపు 15 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం. విలువ దాదాపు రూ.15 వేల కోట్లు ఉంటుందని ఓ అధికారి అంచనా వేశారు. కొందరు వ్యాపారులు తమ ఫరమ్‌ పేరిట, ఏజెన్సీల పేరిట పంటను నిల్వ పెట్టుకోగా, ఇంకొందరు ఆదాయపు, ఇతర పన్నుల నుంచి తప్పించుకునేందుకు రైతుల పేరిట కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ పెట్టారు. కొద్ది రోజులుగా వ్యాపారులు ఖరీదు దారులకు(ఎగుమతిదారులు) విక్రయాలు చేస్తున్నారు.

ఎగుమతి దారులు ఎప్పటికప్పుడు సరుకును విదేశాలకు పంపించేస్తున్నారు. అప్పట్లో క్వింటా రూ.6,500కే విక్రయించా.. రెండెకరాల్లో మిర్చి వేశా. 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. పంట సాగుకు పెట్టుబడి అప్పుగా తీసుకొచ్చా. అవసరాలు, అప్పుల దృష్ట్యా పంట పండిన వెంటనే క్వింటాకు రూ.6,500 చొప్పున విక్రయించా. ఇప్పుడున్న రేటుతో చూసుకుంటే క్వింటాకు రూ.6 వేలు కోల్పోయా. ఇప్పుడు విక్రయించి ఉంటే మరో రూ. 2.40 లక్షల వరకు అదనంగా వచ్చేవి. – బిచ్చాల శ్రీనివాస్‌రావు, వల్లభి, ముదిగొండ మండలం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top