మెరుపు వేగంగా కాళేశ్వరం 

Minister Harish Rao comments on Kaleshwaram Project - Sakshi

వచ్చే నెలలో మూడు పంపుల ద్వారా నీరు 

అధికారులతో సమీక్షించిన మంత్రి హరీశ్‌రావు  

పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టు పనులు మెరుపు వేగంతో పూర్తవుతున్నాయని, అన్ని ప్రాజెక్టుల్లోనూ కాళేశ్వరం ప్రాజెక్టు రికార్డు సృష్టించబోతోందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మేడారంలోని ప్యాకేజీ–6 పనులను మంగళవారం మంత్రి పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల చివరి వారంలో గ్యాస్‌ ఆధారిత కరెంటు ఉత్పత్తిని పూర్తి చేయాలన్నారు. వచ్చే జూలై నాటికి మూడు పంపుల ద్వారా నీరందించాలన్నారు. దీనికి కావాల్సిన నిపుణులను రంగంలోకి దించి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఇప్పటికి రెండు పంపులు పూర్తయినందున మూడో పంపు పనులను సైతం త్వరితగతిన పూర్తి చేసి, జూలై నాటికి అందుబాటులో ఉంచాలని మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. టన్నెల్‌ నిర్మాణం అయినందున వర్షాలు సమృద్ధిగా కురిసి నీరు నిల్వ స్థాయికి చేరగానే అనుకున్న వ్యవధికి నీటిని విడుదల చేసేందుకు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైపు దేశంలోని అన్ని రాష్ట్రాలు తొంగి చూస్తున్నాయన్నారు. అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి, సాగు, తాగునీటి సమస్యలను తీర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దీనికోసం యంత్రాం గం చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top