మీడియా పాయింట్ | Media Point | Sakshi
Sakshi News home page

మీడియా పాయింట్

Mar 25 2015 1:15 AM | Updated on Oct 9 2018 6:36 PM

మీడియా పాయింట్ - Sakshi

మీడియా పాయింట్

ప్రభుత్వం బీసీలకు సబ్‌ప్లాన్ ప్రకటించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది.

బీసీలకు సబ్‌ప్లాన్ ప్రకటించాలి

ప్రభుత్వం బీసీలకు సబ్‌ప్లాన్ ప్రకటించడంలో అలసత్వం ప్రదర్శిస్తోంది. జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు  బడ్జెట్‌లో తగిన నిధుల కేటాయింపులు జరగక అన్యాయం జరిగింది. ప్రభుత్వానికి ప్రాధాన్యత అంశాల పట్టింపు లేదు. సాగునీరు, ఉద్యోగాల భర్తీ, నిధుల కేటాయింపుల్లో నిర్లక్ష్యం వహిస్తోంది.  మిగిలిన ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి.    -ఆర్.రవీంద్రకుమార్, సీపీఐ ఎమ్మెల్యే

సబ్‌ప్లాన్‌పై ప్రభుత్వ వైఖరి ఏమిటి?

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఈ నిధులను ఖర్చు చేయకుండా ఇతర పథకాలకు దారి మళ్లించడంపై కేసులు పెడ్తాం. బడ్జెట్ సమావేశాల్లో ప్రజాస్వామ్య విలువలను ప్రభుత్వం మంటగలిపింది. ప్రతిపక్షాలను బయటకు గెంటేసి సభ నిర్వహిస్తోంది.      - సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ ఎమ్మెల్యే
 
సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచాలి


కోల్ ఇండియా మాదిరిగా సింగరేణి కార్మికులకు వేతనాలు పెంచి రెగ్యులరైజ్ చేయాలి. కార్మిక సంఘాలతో  కుదిరిన ఒప్పందాలను అమలు చేయాలి. ఎన్నికల ముందు వాగ్దానాలు చేసిన విధంగా ఉద్యోగ నియామకాలను చేపట్టాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి. నిరుద్యోగులను మోసం చేయకుండా ప్రభుత్వం ఖాళీ పోస్టుల్లో భర్తీ చేయాలి.    - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే

ఇందిరా పార్క్‌ను చెరువుగా మార్చవద్దు

ఆహ్లాదకర ఇందిరా పార్క్‌ను చెరువుగా మారుస్తామని సీఎం ప్రకటించడం తగదు. హుస్సేన్‌సాగర్ కాకుండా ఇందిరా పార్క్‌లో గణేష్ నిమజ్జనం ఎలా సాధ్యం. ఇందిరా పార్క్ వాకర్స్ కూడా ఆందోళనకు దిగారు.  ప్రభుత్వం తన నిర్ణయాన్ని సత్వరమే ఉపసంహరించుకోవాలి. సాగర్ శుద్ధి పేరుతో మురుగు నీరు బస్తీల్లో వదలడాన్ని వ్యతిరేకిస్తున్నాం.     -కె.లక్ష్మణ్, బీజేపీ ఎమ్మెల్యే
 
కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేయండి

ప్రభుత్వ యంత్రాంగంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేస్తే.. మూడు లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడుతాయి. అపుడు వీటిని భర్తీ చేయాలి. ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం వద్ద తగిన ప్రణాళిక లేదు. కాంట్రాక్టు పోస్టులను క్రమబద్ధీకరించాలి లేదా రద్దుచేయాలి. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులపై ప్రభుత్వ సీఎస్ కమలనాథన్ కమిటీకి లేఖ రాయడం దారుణం. దీనిపై ఆర్థికశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు.    - చింతల రాంచంద్రారెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే
 
సభను తప్పుదోవ పట్టిస్తున్న మంత్రి హరీశ్   

శాసన సభను మంత్రి హరీశ్‌రావు తప్పుదోవ పట్టిస్తున్నారు. కమలనాథన్ కమిటీ కేవలం 1700 ఉద్యోగాలకు సంబంధించినదే. మిగితా పోస్టులు ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నిస్తే మంత్రి హరీశ్‌రావు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యహరిస్తున్నారు. నిరుద్యోగ సమస్యను అధిగమించేందుకు వెంటనే ఉద్యోగఖాళీల్లో నియామకాలు చేపట్టాలి.
 -రాంమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు

రాష్ట్రంలో  నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటై పది మాసాలు గడుస్తున్నా  ఉద్యోగాల నియామకాలు ఎప్పుడు చేపడుతారో స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. వయస్సు పెరుగుతుండటంతో ఆత్మస్థ్యైర్యం కోల్పోతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో ప్రభుత్వం మాట తప్పింది.      - వంశీచంద్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement